డీజీపీ అంజనీకుమార్ కొనసాగేనా - ఉత్కంఠ..!?
తెలంగాణ సీఎస్ గా పని చేసిన సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లిపోయారు. హైకోర్టు తీర్పుతో ఆయన ఏపీలో రిపోర్టు చేయక తప్పలేదు. ఇప్పుడు అదే తరహాలో కొంత మంది సీనియర్ ఐఏఎస్..ఐపీఎస్ అధికారులకు తప్పేలా లేదు. దీనికి సంబంధించి హైకోర్టు ఏం చెబుతుందనే ఉత్కంఠ అధికార వర్గాల్లో కనిపిస్తోంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పని చేస్తున్న 12 మంది అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపు వివాదానికి సంబంధించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. వీటిలో డీజీపీ అంజనీ కుమార్ పై పిటీషన్ కూడ ఉంది.
తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్కుమార్ తరహాలోనే డీజీపీ అంజనీకుమార్, ఇతర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఏపీకి వెళ్లక తప్పని పరిస్థితులు కొనసాగుతున్నాయి. 2014లో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో పని చేస్తున్న ఐఏఎస్..ఐపీఎస్ అధికారులను ఏపీ - తెలంగాణకు కేటాయించారు. అందులో 11 మంది అధికారులు తమ కేటాయింపులను సవాల్ చేస్తూ క్యాట్ ను ఆశ్రయించారు. దీని పైన విచారణ చేసిన క్యాట్ మార్గదర్శకాలు సిరగా లేవంటూ వాటిని రద్దు చేస్తూ 2016లో తీర్పు ఇచ్చింది. దీనిని కేంద్రంతో పాటుగా పలువురు అధికారులు 2017లో హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. అందులో ఇద్దరు అధికారులు తమ పిటీషన్ లను ఉప సంహరించుకున్నారు. గత వారం సోమేశ్ కుమార్ కేటాయింపుపైన విచారించిన హైకోర్టు ఆయన్ను ఏపీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది.
ఇప్పుడు ఇదే తరహాలో మిగిలిన అధికారుల అంశం పైన హైకోర్టు విచారణ చేయనుంది. సోమేశ్కు ఇచ్చిన తీర్పే వర్తిస్తుందని హైకోర్టు ప్రకటిస్తే వీరంతా తమకు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. కేసులు ఉన్న అధికారుల జాబితాలో డీజీపీ అంజనీకుమార్ సహా రోనాల్డ్ రోస్, జి.అనంతరాములు, ఆమ్రపాలి తదితరులు ఉన్నారు. దీంతో..ఇప్పుడు హైకోర్టు నిర్ణయం పైన అధికార వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. సోమేశ్ కుమార్ ఏపీలో రిపోర్టు చేసినా..ఇప్పటి వరకు ఆయనకు అక్కడ ఇంకా పోస్టింగ్ ఖారారు కాలేదు. ఇక, ఇప్పుడు ఈ అధికారుల విషయంలో హైకోర్టు తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకం కానుంది. ముఖ్యమైన పోస్టులో ఉన్న అధికారులు ఈ జాబితాలో ఉండటంతో.. హైకోర్టు విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది.