కదిలించిన తెలంగాణ పేద విద్యార్థి కథ సుఖాంతం:ఇంటర్ పరీక్ష ఫీజు రూ.25వేలు చెల్లించిన బోర్డు కార్యదర్శి
హైదరాబాదు: ఇంటర్ బోర్డు తన కూతురుకు విధించిన రూ.25వేలు జరిమానాను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించి వార్తల్లో నిలిచింది శివలీల అనే పనిమనిషి. వచ్చే నెలలో తన కూతురు ఇంటర్మీడియెట్ పరీక్షలు రాయాల్సి ఉండగా పరీక్ష ఫీజు లేటుగా కట్టడంతో జరిమానా విధించింది. ఎలాగైనా సరే తన కూతురు ఇంటర్ పరీక్షలు రాయాలని చెప్పి ఫిబ్రవరి 12న హైకోర్టును ఆశ్రయించింది. తన కూతురు పరీక్ష రాసేందుకు అనుమతిస్తూ ఇంటర్ బోర్డుకు ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. ఎట్టకేలకు ఈ కథకు ముగింపు కార్డు పడింది. ఇక ఆ విద్యార్థి ఇంటర్ పరీక్షలు రాసేందుకు లైన్ క్లియర్ అయ్యింది.

ఫీజును చెల్లించిన బోర్డు సెక్రటరీ
సోమవారం రోజున పిటిషన్ విచారణకు వచ్చింది. పరీక్ష ఫీజు చెల్లించనందున జరిమానా రూ.25వేలు వేశామని ఇంటర్ బోర్డు కోర్టుకు తెలిపింది. అయితే ఇప్పటికే విద్యార్థి కుటుంబ పరిస్థితి ఆర్థిక పరిస్థితి తెలుసుకుని బోర్డు సెక్రటరీ లేటు ఫీజుతో సహా మొత్తం రూ.3470ని చెల్లించారు. అంటే లేటు ఫీజు రూ.3000 పరీక్ష ఫీజు రూ.470 కలిపిచెల్లించారు. విద్యార్థి కేసును ప్రత్యేక కేసుగా పరిగణిస్తున్నామని చెప్పారు. ఇక ఇంటర్ బోర్డు విద్యార్థిని పరీక్ష రాసేందుకు అనుమతించడంతో కథ సుఖాంతమైంది.

మానవత్వం చాటిన హైకోర్టు సిబ్బంది
అంతకుముందు విద్యార్థిని కష్టాన్ని చదువుకోవాలన్న తపన చూసిన హైకోర్టు జడ్జి పిపవినోద్ కుమార్ ఆ మొత్తాన్ని చెల్లించేందుకు ముందుకు వచ్చారు. ఇక ఈ కేసును వాదించేందుకు అడ్వకేట్ రవికుమార్ ముందుకొచ్చారు. ఎలాంటి ఫీజు లేకుండానే వాదించారు. అంతేకాదు పిటిషన్ టైప్ చేసే టైపిస్టు కూడా ఆమెకు సహాయం చేశారు. అక్కడి నుంచి పిటిషన్ నెంబరింగ్లో సహాయం చేశాడు క్లర్కు లక్కు అమర్నాథ్. ఇవన్నీ ఎలాంటి ఫీజులు తీసుకోకుండా చేశారు.

ప్రైవేట్ జూనియర్ కాలేజీల బాధ్యతారాహిత్యంతోనే..
ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు సకాలంలో ఫీజులు చెల్లించేలా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఇంటర్ బోర్డు తెలిపింది. చివరి నిమిషంలో వచ్చి విద్యార్థుల కష్టాలు చెప్పి ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు ఫీజులు చెల్లిస్తున్నాయని బోర్డు తెలిపింది. బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నారు కాబట్టే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని బోర్డు తెలిపింది. ఇదిలా ఉంటే విద్యార్థి తరపున కేసు వాదించిన అడ్వకేట్ రవికుమార్ వడ్ల కొండ మాట్లాడారు. ఇంటర్ బోర్డు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిందని చెప్పారు. అయితే తమ సొంత జేబు నుంచే డబ్బును చెల్లించిందని చెప్పారు. అయితే తాము దాఖలు చేసిన పిటిషన్లో మాత్రం చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రూ.25వేలు జరిమానా ఎలా విధిస్తారన్నది మాత్రమే తాము ప్రశ్నించినట్లు అడ్వకేట్ రవికుమార్ చెప్పారు.
విద్యార్థికి న్యాయం జరిగిందని తను పరీక్షలు రాస్తుంది అన్న వార్త తమకు సంతోషం కలిగించిందని హైకోర్టు సీనియర్ క్లర్క్ లక్కు అమర్నాథ్ చెప్పారు. మానవీయ కోణంలో బోర్డు పరిగణించి ఫీజును చెల్లించడంపై హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థి యొక్క సమయం ఎంత విలువైందో గ్రహించినందుకు సంతోషంగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications