17 స్థానాలు.. బరిలో 443 మంది.. నిజామాబాద్ రసవత్తరం
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు గాను 443 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లైంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో పోటీచేసే వారి సంఖ్య ఫైనల్ అయింది. అన్నీ పార్లమెంటరీ స్థానాలకు కలిపి 60 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
ఈసారి దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ సెగ్మెంట్ లో అత్యధికంగా 185 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. నామినేషన్ల తిరస్కరణ తర్వాత 189 మంది మిగిలారు. 4 నామినేషన్లు ఉపసంహరణ కింద పోను చివరకు 185 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితను వ్యతిరేకిస్తూ 176 మంది రైతులు బరిలోకి దిగారు. పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర ప్రకటించడం లేదనేది అన్నదాతల ఆవేదన.
పెద్దపల్లి పార్లమెంటరీ స్థానంలో నామినేషన్లు ఎవరూ ఉపసంహరించుకోలేదు. దాంతో ఎన్నికల బరిలో 17 మంది నిలిచినట్లైంది. ఆదిలాబాద్లో ఇద్దరు ఉపసంహరించుకోగా.. 11 మంది బరిలో ఉన్నారు. నల్గొండలో నలుగురు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్న కారణంగా అక్కడ 27 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
హైదరాబాద్లో నలుగురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోగా.. బరిలో 15 మంది నిలిచారు. అలాటే సికింద్రాబాద్లో ఇద్దరు విత్ డ్రా చేసుకోగా.. 28 మంది పోటీలో ఉన్నారు. మెదక్లో 8 మంది తప్పుకోగా.. బరిలో 10 మంది ఉన్నారు. జహీరాబాద్లో నలుగురు డ్రాప్ కావడంతో.. ఎన్నికల్లో 14 మంది తలపడనున్నారు. చేవెళ్లలో ఒకరు ఉపసంహరించుకోగా 23 మంది బరిలో ఉన్నారు.