ఇంటిని చక్కదిద్దుకున్న కేటీఆర్.. ఇంతకు ఏం చేశారంటే..!
హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఇంటిని చక్కబెట్టుకున్నారు. తన నివాసంలో స్వయంగా పరిసరాలను శుభ్రం చేసి దోమల మందు చల్లారు. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు కేటీఆర్. ప్రజల భాగస్వామ్యంతోనే సీజనల్ వ్యాధుల నివారణ సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దోమల నివారణతో పాటు పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఇంటిని చక్కబెట్టుకున్న కేటీఆర్.. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజలకు పిలుపు
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సొంత ఇంటిని చక్కబెట్టుకున్నారు. ఇంటి పరిసరాలను తానే స్వయంగా శుభ్రం చేసి దోమల మందు చల్లారు. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న తరుణంలో మంత్రి ఇలా చేయడం ప్రజా ప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తోంది. అదలావుంటే ప్రజల భాగస్వామ్యంతోనే సీజనల్ వ్యాధులు ఆరికట్టొచ్చన్నారు కేటీఆర్. ప్రజల్లో చైతన్యం రావాలని.. ప్రతి ఒక్కరూ సొంతింటిలో పరిశుభ్రతకు సంబంధించి పలు జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

సీజనల్ వ్యాధుల నివారణకు పెద్దపీట
సీజనల్ వ్యాధుల నివారణకు ఆయా ప్రాంతాల్లో మున్సిపాలిటీ సిబ్బంది దోమల నివారణకు, పరిశుభత్రకు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు కేటీఆర్. అదే క్రమంలో హైదరాబాద్లో జీహెచ్ఎంసీ కూడా తగిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఆ మేరకు ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఇళ్లల్లో పారిశుద్ధ్యం సరిగా లేకపోవడంతోనే దోమలు పెరిగి వ్యాధులు విజృంభిస్తున్నాయని తెలిపారు కేటీఆర్. ఆ క్రమంలో ఎవరి ఇంట్లో వారు పారిశుద్ధ్య నిర్వహణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టేలా అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
పరిశుభ్రత పాటించండి.. దోమలను తరిమికొట్టండి..!
సీజనల్ వ్యాధుల నివారణ కోసం చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో భాగంగా కేటీఆర్ ప్రజలను చైతన్యవంతులను చేసే విధంగా తమ ఇంటిలో పరిశుభ్రత పనులు చేపట్టారు. పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలను భాగస్వాములను చేయడమే లక్ష్యంగా తాము నివాసముండే ప్రగతి భవన్లో తొలుత తన ఇంటి పరిసరాలను శుభ్రం చేసి దోమల మందు చల్లారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు కూడా తమ నివాసాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
దోమల సంఖ్య పెరిగే అవకాశం ఇవ్వకుండా నీటి తొట్టెలను, నీరు నిలువ ఉండే ప్రదేశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అలాగే ఇంటి మూలలు, సందుల్లో ఉన్న అవసరం లేని వస్తువులను తొలగించాలని సూచించారు. ఇదంతా తమకు ఎందుకులే అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్యంపై అవగాహన పెంచుకున్నప్పుడే సీజనల్ వ్యాధులను అరికట్టొచ్చని అన్నారు. ఇంటి ముందర, ఇంటి లోపల నీరు నిలువ ఉండే ప్రాంతాల్లో నీటిని తొలగించాలని సూచించారు.












Click it and Unblock the Notifications