కరోనా విలయం:బాహుబలి కత్తే ఆయుధం.. వైరస్ కేక్తో మంత్రి బర్త్డే వేడుకలు..
దేశవ్యాప్త లాక్ డౌన్ రెండో దశ కొనసాగుతున్నా కరోనా వైరస్ ప్రభావం ఎక్కడా తగ్గలేదు సరికదా, కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటిదాకా మొత్తం 809 కేసులు నమోదయ్యాయి. ఆర్థిక వ్యవస్థ మరింత పతనం కాకుండా ఉండేలా, సోమవారం నుంచి కొన్ని రంగాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చే విషయమై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమాలోచనలు జరుపుతున్నారు. సరిగ్గా అదే సమయంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది..
కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న టాప్-8 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇక్కడి తొమ్మిది జిల్లాలు రెడ్ జోన్ లోను, 20 జిల్లాలు ఆరెంజ్ జోన్ లోనూ ఉన్నాయి. జోన్లతో నిమిత్తం లేకుండా అంతటా లాక్ డౌన్ ఆదేశాలు అమలులో ఉన్నాయి. కానీ రూల్స్ కు విరుద్ధంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గుంపుతో కలిసి పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోవడం.. అది కూడా ఆస్పత్రిలో నిర్వహించడం వివాదాస్పదమైంది. ఆదివారం మంత్రి పుట్టిన రోజు సందర్భంగా ఆయన స్వస్థలమైన ఖమ్మంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.
తన చుట్టూ పెద్ద గుంపు చేరగా, వాళ్ల కరతాళధ్వనుల మధ్య మంత్రి అజయ్.. కరోనా వైరస్ ఆకారంలో తయారు చేసిన కేక్ ను.. బాహుబలి కత్తితో కట్ చేశారు. ఈ వేడుకకు సంబంధించి ఫొటోలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. కేక్ కటింగ్ తోపాటు రక్తదానం కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.
ప్రస్తుతం ఆరెంజ్ జోన్ లో ఉన్న ఖమ్మం జిల్లాలో ఏడు కొవిడ్-19 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కరోనా కేక్ తో పుట్టినరోజు జరుపుకోవడంపై మంత్రి స్పందించాల్సిఉంది.