సోనూసూద్ కోసం.. హైదరాబాద్ నుంచి ముంబై పాదయాత్ర, విద్యార్థి సాహసం..
సోనూసూద్.. కరోనా లాక్ డౌన్ సమయంలో ఆయన చేసిన మంచితో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతీ ఒక్కరు ఆయనను కీర్తిస్తున్నారు. మిలియనీర్, బిలియనీర్లు చేయని పనిని చేశారు. దీంతో సోనూసూద్కు మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఆయనకు ఫ్యాన్స్ ఏర్పడ్డారు. కలువాలని.. ఫోటో దిగాలని అనుకుంటున్నారు. అలా తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి పాదయాత్రగా ముంబై బయల్దేరాడు.
వికారాబాద్ జిల్లా దోర్నాలపల్లికి చెందిన వెంకటేశ్ ఇంటర్ చదువుతున్నాడు. కాలేజీ జరగకపోవడంతో ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. తండ్రి ఆటో డ్రైవర్ కాగా, ఇటీవల వాయిదా చెల్లించకపోవడంతో వారి ఆటోను ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు స్వాధీనం చేసుకున్నారు. విషయానికొస్తే... కరోనా విపత్కర పరిస్థితుల్లో నటుడు సోనూ సూద్ దాతృత్వ సేవలు వెంకటేశ్ను ఆకట్టుకున్నాయి.
తన తల్లిదండ్రులే తనకు స్ఫూర్తి అని ఓ సందర్భంలో సోనూ సూద్ చెప్పిన మాటలు వెంకటేశ్లో బలంగా నాటుకుపోయాయి. ఎలాగైనా సోనూసూద్ను కలవాలని నిశ్చయించుకున్నాడు. హైదరాబాద్ నుంచి ముంబయికి పాదయాత్రగా బయల్దేరాడు. మధ్యలో గుడి కనిపిస్తే సోనూ సూద్ పేరుతో పూజలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ముంబై వెళ్లిన తర్వాత సోనూసూద్ను కలిసి, తన కుటుంబ పరిస్థితిని వివరించాలని వెంకటేశ్ భావిస్తున్నాడు.
లాక్ డౌన్ సమయంలో సోనూసూద్ అన్నార్థుల ఆకలి తీర్చాడు. స్వగ్రామం వెళతా అంటే బస్సులను ఏర్పాటు చేశారు. విదేశాల్లో ఉన్నవారిని స్వదేశం రప్పించారు. భోళా శంకరుడిలా మారి.. సేవ చేశారు. ఆయన చేసిన మంచి పనిని ప్రతీ ఒక్కరు కీర్తిస్తున్నారు. ఇప్పుడు విద్యార్థి వెంకటేశ్ అతనిని కలిసేందుకు ముంబై మహానగరం చేరుకోబోతున్నాడు. అతనికి ఆల్ ద బెస్ట్ చెబుదామా మరీ.