ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో టీజేఎస్ అభ్యర్థిగా కోదండరాం
హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల రసవత్తరంగా సాగేలా కనిపిస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అయితే, బరిలో విపక్షాల నుంచి గట్టి పోటీనిచ్చే అభ్యర్థులే బరిలో నిలుస్తున్నారు. తాజాగా, తెలంగాణ జనసమితి పార్టీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీకి దిగింది.
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తెలంగాణ జనసమితి తరపున ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం పోటీ చేస్తున్నారు. హైదరాబాద్లోని టీజేఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వరరావు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ఎన్నికల నిమిత్తం లేకుండా ప్రజల తరపున పోరాడుతున్నామని, ఆత్మగౌరవాన్ని పెంపొందించే విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో నిరంకుశపాలన జరుగుతోందని, ప్రజాస్వామ్య విలువలను ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని కోదండరాం విమర్శించారు. పోటీకి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను కార్యకర్తలతో కలిసి వడుదల చేశారు.
హైదరాబాద్-రంగారెడ్డి-ఉమ్మడి మహబూబ్నగర్.. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతోపాటు ఇప్పుడు టీజేఎస్ కూడా బరిలోకి దిగుతోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ 1 నుంచి ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. 2015 ఎన్నికల్లో ఓటర్ల జాబితాను పూర్తిగా రద్దు చేసిన నేపథ్యంలో.. 2017 నాటికి పట్టభద్రులైనవారు అక్టోబర్ 1 నుంచి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. ఓటరు నమోదుకు నవంబర్ 11 వరకు గడువు. డిసెంబర్ 1న ఓటరు ముసాయిదాను ప్రకటిస్తారు. తుది ఓటర్ల జాబితాను జనవరి 18న ప్రకటించనున్నారు.












Click it and Unblock the Notifications