రోడ్డు తవ్వాలా..? GST కట్టండి..! సామాన్యులకు తప్పని తిప్పలు..!!
హైదరాబాద్ : పారదర్శక, సులువైన పౌర సేవలందించేందుకు అందుబాటులోకి తీసుకొస్తోన్న సాంకేతిక విధానాలు అధికారుల అనాలోచిత నిర్ణయాలతో జటిలంగా మారుతున్నాయి. కార్యాలయాల గడప తొక్కకుండా ఆన్లైన్లో అందాల్సిన సేవల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. జీఎస్టీ పేరిట కొత్తగా విధించిన షరతులతో ఆన్లైన్లో రోడ్ల తవ్వకాల అనుమతికి అవకాశం లేకుండా పోయింది. దీంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు జీఎస్టీ శరాఘాతంగా పరిణమించిందనే చర్చ జరుగుతోంది.
జటిలంగా మారుతోన్న సాంకేతిక సేవలు..! నగరంలో ఇబ్బందికరంగా మారిన అనుమతులు..!!
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా రహదారుల తవ్వకాలకు ఆన్లైన్లో అనుమతినిచ్చే విధానం ఏడాది క్రితం అందుబాటులోకి వచ్చింది. ఇళ్లు, కార్యాలయాలకు నల్లా కనెక్షన్ మొదలు సివరేజ్ పైపులైన్ అనుసంధానం, భూగర్భ విద్యుత్ కేబుళ్ల కోసం రోడ్డు తవ్వకాల అనుమతికి ఈఓబీడీలో భాగంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ తదితర విభాగాలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని నిర్ణీత రుసుం చెల్లించిన వారికి పర్మిషన్ ఇస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం వరకు సాఫీగా సాగిన సాంకేతిక ప్రక్రియలో, జీఎస్టీ పేరిట కొత్తగా పెట్టిన మెలికతో సాధారణ పౌరులు ఇబ్బందులు పడుతున్నారు.
28 కిలో మీటర్ల తవ్వకాల కోసం అనుమతులపై ఆంక్షలు..! ఈనెల 31తర్వాతే అంటున్న జీహెచ్ఎంసీ..!!
స్వచ్ఛ సర్వేక్షణ్ - 2019 నేపథ్యంలో ఈ నెల 31వ తేదీ వరకు రహదారుల తవ్వకాలపై నిషేధం విధిస్తునన్నట్టు తాజాగా మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. సర్వేలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక బృందం రానున్న నేపథ్యంలో నగర అందం దెబ్బతినకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏడాదిన్నరగా రోడ్డు తవ్వకాలకు పరిమిత స్థాయిలో అనుమతి ఇస్తోన్న నేపథ్యంలో ఇప్పుడూ అదే విధానం అవలంబించాలని అధికారులు భావిస్తున్నారు. భూగర్భ విద్యుత్ కేబుళ్ల నిర్మాణం కోసం 28 కిలో మీటర్ల మేర రోడ్ల తవ్వకానికి అనుమతి ఇవ్వాలని టీఎస్సీ పీడీసీఎల్ తాజాగా జీహెచ్ఎంసీని కోరింది. దీనికి సంబంధించి నిర్ణీత మొత్తం చెల్లించాలని డిమాండ్ నోటీస్ పంపిన జీహెచ్ఎంసీ, జనవరి 31 తరువాత తవ్వాలన్న షరతుతో అనుమతి ఇస్తామని చెబుతోంది.
గతంలో అనుమతులు ఎంతో సరళం..! ఇప్పుడే ఎంతో కఠినం..!!
ఇంతకుముందు రోడ్ల తవ్వకాల అనుమతి కోసం ఈఓబీడీలో దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు, సంస్థలు అధికారుల డిమాండ్ నోటీస్ ప్రకారం పునరుద్ధరణ పనులకయ్యే మొత్తాన్ని డీడీ లేదా ఆన్లైన్లో చెల్లించేవారు. ఐదు మీటర్ల వరకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఐదు నుంచి పది మీటర్ల వరకు సూపరింటెండెంట్ ఇంజనీర్, పది మీటర్ల కంటే ఎక్కువ పొడవు మేర తవ్వకాల కోసం చీఫ్ ఇంజనీర్ స్థాయిలో అనుమతి ఇస్తున్నారు. పొడవును బట్టి రహదారి పునరుద్ధరణకు ఎంతవుతుందన్నది 18 శాతం జీఎ్సటీతో కలిపి రుసుముగా నిర్ణయించేవారు. ఆ మొత్తాన్ని జీహెచ్ఎంసీ, ఆర్ అండ్బీల ఖాతాల్లో జమ చేస్తే.. వాళ్లే జీఎ్సటీ విభాగానికి చెల్లించేవారు. సంస్థలైనా, వ్యక్తులకైనా ఈ విధానంతో నాడు ఇబ్బందులు ఉండేవి కావు.
ప్రస్తుతం ఎన్నో ఆటంకాలు..! అనుమతులు పొందడం ఎంతో గగనమే..!!
ప్రస్తుతం ఆన్లైన్ దరఖాస్తు విధానంలో మార్పులు చేశారు. 18 శాతం జీఎస్టీని జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీకి కాకుండా ఆ విభాగానికి చెల్లించాలనే షరతు విధించారు. జీఎస్టీ నెంబర్ తప్పనిసరిగా ఎంటర్ చేయాలని స్పష్టం చేశారు. నేరుగా ఆ విభాగానికి చెల్లించాలంటే జీఎస్టీ నెంబర్ అవసరం. సంస్థలకైతే జీఎస్టీ నెంబర్ ఉంటుంది కానీ వ్యక్తులకు ఆ అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఇంటి అవసరాల కోసం రోడ్డు తవ్వకాలకు అనుమతి తీసుకోవాల్సిన సామాన్యులు అవస్థలు పడుతున్నారు. జీఎస్టీ నెంబర్ లేకపోవడంతో దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. దీనిపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తోన్ననేపథ్యంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్కు జీహెచ్ఎంసీ లేఖ రాసింది. జీఎస్టీ నెంబర్ ఎంట్రీని ఆప్షనల్గా మార్చాలని, ఆ నెంబర్ లేని వారు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించాలని కోరారు. మరి ఈ లేఖ పై సీజీజీ ఏ విదంగా స్పందిస్తుందో చూడాలి.