తనీష్ను ప్రశ్నించిన ఈడీ అధికారులు: అనుమానాస్పద లావాదేవీలపై 7గంటలపాటు విచారణ
హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సినీనటుడు తనీష్ను శుక్రవారం విచారించారు. సుమారు ఏడు గంగలపాటు అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు.
బ్యాంక్ ఖాతాలు, అనుమానాస్పాద లావాదేవీలపై ఆరా తీశారు. డ్రగ్స్ విక్రేత కెల్విన్తో ఉన్న సంబంధాలు, ఎఫ్ క్లబ్లో జరిగే పార్టీలకు ఎప్పుడైనా హాజరయ్యారా? ఎఫ్ క్లబ్లో డ్రగ్స్ సరఫరా చేస్తారా? డ్రగ్స్ వినియోగించే సెలబ్రిటీలు మీకు ఎవరైనా తెలుసా? అంటూ తనీష్కు ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది.
ఈడీ విచారణ అనంతరం తనీష్ మీడియాతో మాట్లాడారు. మళ్లీ విచారణకు రావాలని ఈడీ చెప్పలేదు. ఒకవేళ ఈడీ అధికారులు పిలిస్తే విచారణకు హాజరవుతానని తనీష్ స్పష్టం చేశారు. కాగా, డ్రగ్స్ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న ప్రధాన నిందితుడు కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ బుధవారం నటి ముమైత్ ఖాన్ను కూడా విచారించారు. బుధవారం ఉదయం మొదలైన విచారణ దాదాపు 7 గంటల పాటు జరిగింది. ఈ విచారణలో అధికారులు ముమైత్ ఖాన్పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం.
ముబైత్ బ్యాంకు ఖాతాలను పరిశీలించిన ఈడీ అధికారులు.. ముమైత్కు ముంబైలో రెండు అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు. గతంలో ఆమె జరిపిన లావాదేవీలపై ఆరా తీశారు. 2017లో ఎక్సైజ్శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈడీ ముమైత్ను విచారించింది. ఇక, ఎఫ్ లాంజ్ క్లబ్లో జరిగిన ఈవెంట్లు, నగదు లావాదేవీలపై ముమైత్ను అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది.
కెల్విన్, జిషాన్లతో ముమైత్కు నేరుగా సంబంధాలు ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్లాంజ్ క్లబ్ జీఎంకి ముమైత్కు మధ్య జరిగి బ్యాంకు లావాదేవీలపై ఈడీ ఆరాతీసింది. తర్వాత ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని అధికారులు ముమైత్కు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. డ్రగ్స్ కేసులో ముమైత్ను నాలుగేళ్ల క్రితం ఎక్సైజ్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆమెను పది గంటల పాటు విచారించారు.
ఇది ఇలావుండగా, టాలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణలో భాగంగా ఇప్పటికే పలువురు సినీనటులను విచారించింది. సోమవారం సినీనటుడు నవదీప్ ఈడీ విచారణకు హాజరయ్యారు. దాదాపు 9 గంటలపాటు ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించారు. నవదీప్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించి అనుమానాస్పద లావాదేవీలు, డ్రగ్స్ సరఫరాదారు కెల్విన్తో సంబంధాలు, తదితర విషయాల గురించి ఆరా తీశారు. అవసరమైనప్పుడు అందుబాటులో ఉండాలని ఈడీ అధికారులు నవదీప్ను ఆదేశించినట్లు సమాచారం. నవదీప్ తోపాటు ఎఫ్ క్లబ్ జీఎం విక్రమ్ పైనా ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.
కాగా, టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నిధుల మళ్లింపునకు సంబంధించి కేసులో గత గురువారం ప్రముఖ సినీ నటుడు రవితేజ, ఆయన వ్యక్తిగత డ్రైవర్ శ్రీనివాస్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారించింది. దాదాపు ఆరుగంటల పాటు వీరిద్దరిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. మనీలాండరింగ్ కోణంలో రవితేజ బ్యాంక్ ఖాతాల అధికారులు పరిశీలించారు. అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీసినట్లు సమాచారం. డ్రగ్స్ విక్రేత కెల్విన్ తో ఏమైనా పరిచయం ఉందా? ఆయన ఖాతాకు ఎప్పుడైనా భారీ మొత్తంలో నిధులు పంపించారా? అనే విషయాలతోపాటు ఎఫ్ క్లబ్ గురించిన ప్రశ్నలు వేసినట్లు సమాచారం. కాగా, ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్న మహమ్మద్ జిషాన్ అలీఖాన్ అలియాస్ జాక్ను కూడా ఈడీ అధికారులు విచారించారు. జిషాన్ 2017లో కొకైన్ సరఫరా చేస్తూ ఎక్సైజ్ శాఖకు దొరికాడు. జిషాన్తో పాటు బెర్నాడ్ అలియాస్ విలియమ్స్ను ఎక్సైజ్ శాఖ అరెస్ట్ చేసింది. ఎఫ్ ప్రొడక్షన్కు జిషాన్ గతంలో భాగస్వామిగా వ్యవహరించాడు. సోషల్ మీడియా, యాప్ల ద్వారా సినీ తారలకు జిషాన్, విలియమ్స్ డ్రగ్స్ సరఫరా చేశారనే అభియోగాలు నమోదయ్యాయి. కెంట్ అనే వ్యక్తి ద్వారా నైజీరియా నుంచి కొరియర్స్ ద్వారా హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు నిందితులు ఎక్సైజ్ శాఖకు తెలిపారు.