కాబోయే ఐపీఎస్.. ప్రేమ పెళ్లితో దగ్గరై.. ఇప్పుడేమో వేధింపులు..!
హైదరాబాద్ : కాబోయే ఐపీఎస్ ఆఫీసర్ దారి తప్పాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఓ మహిళ. ప్రేమ పేరుతో తనకు దగ్గరై.. పెళ్లి కూడా చేసుకుని ఏడాదిగా తనతో కాపురం చేసి ఇప్పుడేమో ప్లేట్ ఫిరాయిస్తున్నాడని ఆరోపిస్తూ కేసు పెట్టారు. చదువుకునే క్రమంలో తాము ఒక్కటయ్యామని.. ఇప్పుడు ఐపీఎస్కు ఎంపిక కావడంతో మాట మార్చుతున్నాడనేది ఆమె వెర్షన్. హైదరాబాద్లో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశమైంది.
ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ మహేశ్ రెడ్డి కుటుంబ వివాదంలో ఇరుక్కున్నారు. తనను ప్రేమించి పెళ్లి చేసుకుని ఏడాది కాపురం కూడా చేసి తీరా ఇప్పుడు కాదు పొమ్మంటున్నాడని ఆరోపిస్తూ భావన అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపికైంది. కడప జిల్లాకు చెందిన మహేశ్ రెడ్డితో తనకు ఏడాది కిందట పెళ్లి జరిగినట్లు సదరు యువతి ఆరోపిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో మహేశ్ రెడ్డితో తనకు పరిచయం ఏర్పడిందని.. ఆ క్రమంలో ప్రేమ పేరుతో దగ్గరయ్యాడని చెబుతున్నారు. అలా తనపై ఇష్టం పెంచుకున్న మహేశ్ రెడ్డి పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేయడంతో ఏడాది కిందట తమకు మ్యారేజ్ జరిగిందని అంటున్నారు భావన.
బీజేపీతో చర్చల్లేవ్.. శివసేన స్టెప్ బ్యాక్.. వేడెక్కుతున్న మహా రాజకీయం..!
పెళ్లి తర్వాత సంవత్సర కాలం నుంచి ఇద్దరం కలిసే ఉంటున్నామని.. ఒకే దగ్గర నివసిస్తున్నట్లు కంప్లైంట్లో పేర్కొన్నారు. అయితే ఐపీఎస్గా సెలెక్ట్ కావడంతో మహేశ్ రెడ్డిలో చాలా మార్పు వచ్చిందని ఆరోపిస్తున్నారు. అదే క్రమంలో తానెవరో తెలియదని బుకాయిస్తున్నట్లు పోలీసులకు వివరించారు.
ఇటీవల అదనపు కట్నం తీసుకొస్తే తప్ప కాపురం చేసే ప్రసక్తి లేదన్నట్లుగా మహేశ్ రెడ్డి వేధింపులకు గురి చేస్తున్నాడని.. అందుకే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చిందని చెబుతున్నారు. తనతో పాటు తన కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. మహేశ్ రెడ్డి ఐపీఎస్ అని చూడకుండా తనకు న్యాయం చేయాలని కోరారు. ఆమె ఫిర్యాదు తీసుకున్న పోలీసులు మహేశ్ రెడ్డిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.