గాంధీ ఆస్పత్రి కీలక నిర్ణయం... ఎమర్జెన్సీ కేసులకు వెంటనే ట్రీట్మెంట్... కరోనా రిపోర్ట్ లేకపోయినా...
సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రి యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పాజిటివ్ రిపోర్ట్ లేకపోయినా ఎమర్జెన్సీ కేసులకు చికిత్స అందించాలని నిర్ణయించింది. అత్యవసర చికిత్స కోసం వచ్చే పేషెంట్లను వెంటనే ఆస్పత్రిలో చేర్చుకుని వైద్యం అందించాలని నిర్ణయించినట్లు గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. విషమ పరిస్థితుల్లో పేషెంట్లను ఆస్పత్రికి తీసుకొచ్చే అంబులెన్సులను అడ్డుకోవద్దని సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు.
ఇటీవలి ఓ సంఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఓ మహిళను ఆమె కుమారుడు గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న తన తల్లికి వైద్యం అందించాల్సిందిగా వైద్యులను కోరారు. అయితే ఆమె వద్ద కోవిడ్ రిపోర్ట్ లేకపోవడంతో వైద్యులు చికిత్సకు నిరాకరించారు. దీంతో చేసేది లేక ఇంటికెళ్లిపోయారు.

ఆ తర్వాత ఏడు రోజుల వరకు ఆమె ఇంటి వద్దే చికిత్స తీసుకున్నారు. ఆపై పరిస్థితి విషమించడంతో వెంట వెంటనే రెండు ప్రైవేట్ ఆస్పత్రులకు ఆమెను తరలించారు. కానీ రెండు చోట్ల ఆమెను చేర్చుకునేందుకు వైద్యులు నిరాకరించారు. అలా రెండు గంటల పాటు అంబులెన్సులోనే నరకయాతన అనుభవించిన ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కోవిడ్ రిపోర్టు లేకపోయినా ఎమర్జెన్సీ కేసులకు చికిత్స అందించేందుకు గాంధీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
నిజానికి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆమెకు పాజిటివ్గా తేలినప్పటికీ అక్కడి సిబ్బంది సర్టిఫికెట్ మాత్రం ఇవ్వలేదు. దీంతో ఆస్పత్రుల్లో అడ్మిట్ చేసుకునేందుకు వైద్యులు నిరాకరించారు.మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని వైద్యారోగ్య శాఖ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.
ఇక తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం(ఏప్రిల్ 18) రాత్రి 8గం. నుంచి సోమవారం రాత్రి 8గం. వరకు 5926 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 18 మంది కరోనాతో మృతి చెందారు. మరో 6033 రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,61,359కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1856కి చేరింది. ప్రస్తుతం 42,853 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 2209 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,16,650కి చేరింది.ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.2శాతం ఉండగా... తెలంగాణలో 0.51శాతం ఉంది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 85.6 శాతం ఉండగా తెలంగాణలో 87.62 శాతం ఉంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 793 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,19,42,985కరోనా టెస్టులు నిర్వహించారు.












Click it and Unblock the Notifications