టెస్టులే చేయనప్పుడు కేసులెలా తగ్గుతాయ్..? ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న.. మరణాలపై కూడా..
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహాం వ్యక్తం చేసింది. కరోనా కేసులకు సంబంధించి పరీక్షలపై భగ్గుమన్నది. తక్కువ పరీక్షలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించింది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల పైచిలుకు చేరింది. కానీ ఒక్కో ప్రాథమిక కేంద్రం/ అనుమతి ఇచ్చిన ల్యాబులలో తక్కువ మొత్తంలో పరీక్షలు జరుగుతున్నాయని హైకోర్టు మండిపడింది.
రాష్ట్రంలో కరోనా కేసులపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. కరోనా మరణాలపై ధర్మాసనం మండిపడింది. వైరస్ సోకి చనిపోయిన వారి కేసులను తక్కువగా చూపిస్తున్నారని తెలిపింది. రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 1228గా ప్రభుత్వం చూపించింది. అయితే దాని కన్నా ఎక్కువగా ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది.
హైకోర్టుకు వైద్యారోగ్యశాఖ అధికారి హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గాయని వివరించారు. రికవరీ కూడా బాగుందని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అధికారుల వాదనతో ధర్మాసనం విభేదించింది. రాష్ట్రంలో కరోనా వైరస్ పరీక్షలే చేయనప్పుడు కేసులు ఎలా తగ్గుతాయని ప్రశ్నించింది. నిర్దేశిత సంఖ్యలో చేస్తే ఇబ్బందులు ఉండవని.. కానీ అలా జరగడం లేదని తెలిపింది.
మిగతా రాష్ట్రాల్లో కరోనా టెస్ట్ ల్యాబ్లు ఎక్కువగా ఉన్నాయని.. తెలంగాణలో ఎందుకు తక్కువగా ఉన్నాయని ప్రశ్నించింది. ల్యాబ్లు పెంచితే ఎక్కువ పరీక్షలు చేసే అవకాశం ఉంటుందని సూచించింది. మరోవైపు వెంటిలేటర్లకు సంబంధించి సరైన సమాచారం ఇవ్వడం లేదని ధర్మాసనం అడిగింది. తప్పుడు లెక్కలతో కోర్టును తప్పుదోవ పట్టిస్తోందని ఒకింత ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఇప్పుడే కాదు ఇదివరకు కూడా తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది.