రూ.107 కోట్లు: సంక్రాంతికి ఆర్టీసీకి సమకూరిన ఆదాయం..
సంక్రాంతి పండగ ముగిసింది. జనం తిరుగు పయనం కూడా అవుతున్నారు. మరీ టీఎస్ ఆర్టీసీకి ఎంత ఆదాయం సమకూరిందనే చర్చ కామన్గా వస్తోంది. సంక్రాంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డురవాణా సంస్ధ అదనంగా 55 లక్షలమంది ప్రయాణికులను గమ్యస్ధానాలకు చేర్చామని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. పండుగ రద్దీ దృష్ట్యా షెడ్యూల్ బస్సులతోపాటు అదనంగా 4 వేల బస్సులను నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి అదనపు చార్జీ వసూలు చేయలేదని పేర్కొంది. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రజలను గమ్యస్దానాలకు చేర్చటం ద్వారా సంస్ధకు రూ. 107 కోట్లు ఆర్జించిందని అధికారులు వివరించారు.
హైదరాబాద్ తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం ఆర్టీసీ, రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే శాఖ 110 రైళ్లను ఏర్పాటు చేసింది. తెలంగాణ ఆర్టీసీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. సొంత ఊళ్లకు వెళ్లిన వారి కోసం 3,500 ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. హైదాబాద్ లో నివసిస్తున్న ఆయా గ్రామాలకు చెందిన వారు సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లేందుకు కూడా ఆర్టీసీ పత్యేక బస్సులను కేటాయించింది. సంక్రాంతి పండగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ 4940 ప్రత్యేక బస్సులు నడిపిన సంగతి తెలిసిందే. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులతో సేవలు అందజేసింది.
అంతకుముందు మీ ఇంటి వద్దకే బస్సు సర్వీస్ అందజేసింది. ఫోన్ చేస్తే ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు వచ్చింది. ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవడానికి ప్రయాణికులు కోరిన చోట బస్సును ఆపి ఎక్కించుకోవడం, దించడం చేసిన ఆర్టీసీ మరో అడుగు ముందుకు వేసింది. సంక్రాంతికి ఊరు వెళ్లే ప్రయాణికులు ఒకే ప్రాంతంలో 30 మంది ఉంటే.. వారి ప్రాంతం, వారి కాలనీకి బస్సును పంపిస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. అలా సర్వీస్ కూడా ఇచ్చారు. ఇప్పుడు వారిని తిరిగి భాగ్యనగరం తీసుకొచ్చేందుకు సర్వీసులను నడిపిస్తున్నారు. ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా స్పెషల్ బస్సులకు కూడా అదనపు చార్జీలను వసూల్ చేయడం లేదు. ఈ సారి సంస్థకు ఆదాయం భారీగానే సమకూరింది.