అతి త్వరలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల జీతాల పెంపు: సీఎం కేసీఆర్ నిర్ణయం
హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు తెలంగాణ సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. అతి త్వరలోనే జీతాలు పెంచనున్నట్లు ప్రకటించారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. సంస్థ ఉద్యోగులకు జీతాలు పెంచాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్కు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు మేలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణ మజ్దూర్ యూనియన్ హర్షం వ్యక్తం చేసింది.
త్వరలోనే ఆర్టీసీలో జీతాలు పెంచుతామని.. అందుకు తగిన చర్యలను తీసుకోవాలని ఆర్థిక శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. జీతాల పెంపు కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2017 నుంచి పెండింగ్లో ఉన్న పే రివిజన్ కమిషన్ అమలు కోసం ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కొంత జాప్యం జరిగినా.. తాజాగా కేసీఆర్ ప్రకటనపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, పీఆర్సీతోపాటు డీఏ బకాయిలు కూడా ఆర్టీసీ సిబ్బందికి రావాల్సి ఉంది. వీటికి తోడు 2013 పీఆర్సీ 50 శాతం పెండింగ్లో ఉండగా.. వాటికి బాండ్స్ ఇచ్చారు. ఈ పెండింగ్లో ఉన్న బకాయిలను వడ్డీతో సహా చెల్లించాల్సి ఉందని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు.
అంతేగాక, పీఎఫ్ బకాయిలు, ఎస్ఆర్బీఎస్ నిధులు, సీసీఎస్ నుంచి వాడుకున్న నిధులపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ సంఘాల నేతలు కోరుతున్నారు.
ప్రభుత్వ తాజా నిర్ణయంపై వివరాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. త్వరలోనే ఆర్టీసీ కార్మికుల జీతాలు పెంచాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. డా.అంబేడ్కర్ సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తన ఛాంబర్లో రవాణా శాఖ కమిషనర్ బుద్ధ ప్రకాష్, జేటీసీ రమేష్ తో పలు అంశాలపై చర్చించారు. ఏపీ-తెలంగాణ లారీల సింగిల్ పర్మిట్ విధానంపై సమీక్షా సమావేశంలో ప్రధానంగా చర్చించారు. రవాణా శాఖ పన్ను వసూలు, రవాణా రంగంలో ఆన్లైన్ సేవల పనితీరు తదితర అంశాలపై కూడా చర్చించినట్లు సమాచారం. కష్టకాలంలో కూడా ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో శ్రమించి.. టీఎస్ఆర్టీసీని లాభాల బాటలో పట్టించారని అభినందించారు మంత్రి పువ్వాడ అజయ్.












Click it and Unblock the Notifications