మా పొట్ట కొట్టొద్దు.. మద్దతు ఇవ్వండి.. ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన
హైదరాబాద్ : న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 18వ రోజుకు చేరింది. ప్రభుత్వం మెట్టు దిగి రాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆ క్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు 21వ తేదీ నుంచి పది రోజుల వరకు కార్యాచరణ ప్రకటించారు. వివిధ రూపాల్లో నిరసన తెలిపేలా షెడ్యూల్ విడుదల చేశారు. అందులోభాగంగా మంగళవారం (22.10.2019) నాడు తమ పొట్ట కొట్టొద్దంటూ తాత్కాలిక సిబ్బందికి వినతి పత్రాలు, పూలు ఇచ్చి నిరసన తెలిపారు. మరోవైపు సికింద్రాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర వంటావార్పు కార్యక్రమం చేపట్టారు.

ఉధృతమవుతున్న ఆర్టీసీ సమ్మె.. వినతి పత్రాలు, పూలతో నిరసన
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రోజురోజుకీ ఉధృతమవుతోంది. చర్చల్లేవు అంటూ ప్రభుత్వం మొండికేయడంతో కార్మికులు నిరసనకు దిగుతున్నారు. ఆ క్రమంలో కొన్ని చోట్ల ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. సమ్మెలో భాగంగా ఆందోళనలు చేపడుతున్న కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదాలు జరిగి తోపులాటకు దారి తీస్తోంది. అయితే ప్రభుత్వం దిగి వచ్చేలా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ 21వ తేదీ నుంచి 30 వరకు వివిధ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అందులోభాగంగా మంగళవారం (22.10.2019) నాడు తమ పొట్ట కొట్టొద్దంటూ తాత్కాలిక సిబ్బందికి వినతి పత్రాలు, పూలు ఇచ్చి నిరసన తెలిపారు ఆర్టీసీ కార్మికులు.

తాత్కాలిక సిబ్బందికి వినతి పత్రాలు, పూలు ఇచ్చి నిరసన
22వ తేదీ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని పలు జిల్లాల్లో కార్మికులు విజయవంతం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విధులు నిర్వహిస్తున్న తాత్కాలిక సిబ్బందికి వినతి పత్రాలు, పూలు అందించారు అక్కడి జేఏసీ నాయకులు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతు ఇవ్వాలని.. తమ పొట్ట కొట్టొద్దని విజ్ఞప్తి చేశారు. నిరసన సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగొచ్చని భావించిన స్థానిక ఏసీపీ వెంకటేశ్ చొరవ తీసుకుని బస్టాండ్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కోదాడ డిపో దగ్గర నిరసన ఇలా
సూర్యాపేట జిల్లాలోని కోదాడ ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న వారికి వినతి పత్రాలు, పూలు అందించారు. తమ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించేంత వరకు సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ నెల 30వ తేదీన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో తలపెట్టిన భారీ బహిరంగ సభ విజయవంతం అయ్యేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 18 రోజులుగా సమ్మె జరుగుతుంటే సీఎం కేసీఆర్ ఇలా ప్రవర్తించడం సరికాదని.. ఆయన అహంకారానికి నిదర్శనమని ఆరోపించారు. ప్రభుత్వం దిగి రాకుంటే కార్మికులు చేపట్టిన ఈ పోరాటం మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు.

జేబీఎస్ దగ్గర వంటావార్పు
ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా మారడంతో పలుచోట్ల టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మిన్నంటుతున్నాయి. ఆ క్రమంలో ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలికిన అఖిల పక్షం నేతలు వంటావార్పు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర ఆర్టీసీ జేఏసీ నేతలతో పాటు అఖిల పక్షం నేతలు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.












Click it and Unblock the Notifications