కరోనా వ్యాక్సిన్ తయారీ రాజధానిగా హైదరాబాద్: ప్రపంచంలో 3వ వంతు ఇక్కడే, ఏ దేశమైనా..
హైదరాబాద్: కరోనా మహమ్మారిని ప్రపంచం నుంచి పారదోలేందుకు అనేక దేశాలు వ్యాక్సిన్ అభివృద్ధిలో తలమునకలై ఉన్నాయి. అయితే, కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి ఇప్పుడు భారత్ కీలకంగా మారింది. భారత్ నుంచే సురక్షిత వ్యాక్సిన్ అవచ్చే అవకాశాలున్నాయని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ప్రపంచంలో 3వ వంతు వ్యాక్సిన్లు హైదరాబాద్లోనే..
ప్రపంచంలో సుమారు 60 శాతం వ్యాక్సిన్లను భారత్ అభివృద్ది చేసే అవకాశాలున్నాయని అంచనావేస్తున్నారు. ప్రపంచమంతా ఇప్పుడు భారతదేశంలోని హైదరాబాద్ నగరం వైపు చూస్తున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ నగరానికి చెందిన ఫార్మా కంపెనీలే వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంలో ముందువరుసలో ఉన్నాయి. ప్రపంచంలో మూడోవంతు ఈ నగరం నుంచే వ్యాక్సిన్ అందే అవకాశాలున్నట్లు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
వ్యాక్సిన్ ఎక్కడ విజయవంతమైనా.. చూపు హైదరాబాద్ వైపే
భారత తొలి దేశీయ కోవిడ్ 19 వ్యాక్సిన్ కోవాక్సిన్, లేదా రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ, జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేస్తున్న యాడ్26.కోవ్2.ఎస్, ఫ్లూజెన్కు చెందిన కోరోప్లూ లేదా సోనోఫి లాంటి అన్ని వ్యాక్సిన్లు కూడా హైదరాబాద్ నగరంతో సంబంధం కలిగి ఉండటం గమనార్హం. హైదరాబాద్లో కరోనా వ్యాక్సిన్ విజయవంతంగా అభివృద్ధి చేయబడినా.. లేదా ప్రపంచంలో ఎక్కడ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ అయినా హైదరాబాద్ నుంచే బయటకు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని శాంతా బయోటెక్నిక్స్ లిమిటెడ్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరానికి చెందిన చాలా ఫార్మా కంపెనీలకు సమర్థవంతమైన వ్యాక్సిన్లను మిలియన్ల డోసుల్లో ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉందని తెలిపారు. 2009లో శాంతా బయోటెక్నిక్స్ చేతుల్లోకి వెళ్లిన సనోఫీ నుంచి కూడా 2021 తొలి అర్ధభాగంలో వ్యాక్సిన్ వచ్చే అవకాశాలున్నట్లు తెలిపారు.
ఇప్పటికే పలు సంస్థలతో ఒప్పందాలు
కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తి చేయడంలో హైదరాబాద్ ఫార్మా కంపెనీలు అంతర్భాగంగా ఉన్నాయని బయోలాజికల్ ఈ లిమిటెడ్ ఎండీ మహామా దాట్ల వెల్లడించారు. తమ సంస్థ సొంత వ్యాక్సిన్ అభివృద్ధి కోసం టెక్సాస్లోని బేలర్ కాలేజీ ఆఫ్ మెడిసిన్తో ఒప్పందం కలిగివుందని, అంతేగాక, జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తి చేయనున్న వ్యాక్సిన్ను ఇక్కడ తయారు చేసేందుకు ఆ సంస్థతో బాగస్వామిగా ఉన్నట్లు చెప్పారు.
భాగస్వామి భారత్.. ఉత్పత్తి కేరాఫ్ హైదరాబాద్..
‘హైదరాబాద్ సరసమైన పరిష్కారాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది' అని మహామా దాట్ల చెప్పుకొచ్చారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు వ్యాక్సిన్ తయారీదారుల నెట్వర్క్(డీసీవీఎంఎన్) ప్రెసిడెంట్గా కూడా మహిమా దాట్ల వ్యవహరిస్తున్నారు. ఏ కంపెనీ అయిన వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తే దానికి భాగస్వామి తప్పక అవసరమవుతుంది.. భారత్ లేదా చైనాలోని సంస్థలను ఆశ్రయించాల్సిందే. అయితే, భారతదేశంలో.. ముఖ్యంగా హైదరాబాద్లో వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే ఫార్మా కంపెనీలు చాలా ఉన్నాయి. అందుకే ప్రపంచంలోని చాలా దేశాలు కూడా హైదరాబాద్ నగరంలోని పలు ఫార్మా కంపెనీలను తమ భాగస్వాములుగా ఎంపిక చేసుకుంటున్నాయని తెలిపారు. మనుషులు, జంతువుల వ్యాక్సిన్ల కోసం ఎన్డీడీబీ ఏర్పాటు చేసిన ఇండియన్ ఇమ్యూనలాజికల్స్కు 200 మిలియన్ మల్టీ డోసుల ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఈ కంపెనీ హైదరాబాద్ శివారులోని జీనోమి వ్యాలీలో ఉంది. ఇప్పటికే ఈ కంపెనీ రష్యాకు నుంచి అభివృద్ధవుతున్న స్పుత్నిక్ వీ ఉత్పత్తి కోసం చర్చలు జరిపింది.
Recommended Video
ప్రపంచ సంస్థలకు హైదరాబాద్ కంపెనీల ఆఫర్లు
గ్రిఫిత్ యూనివర్సిటీ ఆఫ్ ఆస్ట్రేలియాతో కలిసి తమ సొంత వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్నాం. అక్టోబర్-నవంబర్ మధ్య వరకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి. 18 నెలలో కోవిడ్ వ్యాక్సిన్ ఇతరుల కోసం ఉత్పత్తి చేస్తామని ఐఐఎల్ ఎండీ కే ఆనంద్ కుమార్ తెలిపారు. ప్రపంచంలో ఏ వ్యాక్సిన్ విజయవంతమైన తాము ఉత్పత్తి చేసేందుకు సిద్ధమంటూ నగరంలోని పలు సంస్థలు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాయి.
అమెరికాకు చెందిన ఆర్అండ్ డీ కంపెనీని చేజిక్కించుకున్న అరబింగో ఫార్మా కూడా కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తామంటూ ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 21 నుంచి తాము ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ వెల్లడించింది. ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న అన్ని సంస్థలకు హైదరాబాద్లోని ఫార్మా కంపెనీల నుంచి వస్తున్న ఆఫర్లే ఉత్తమంగా ఉన్నాయని ఐఐఎల్ డిప్యూటీ ఎండీ ప్రసన్న దేశ్పాండే అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం కూడా హైదరాబాద్.. కరోనా వ్యాక్సిన్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందంటూ ఇప్పటికే ప్రకటించింది. ప్రపంచ ప్రజలను కరోనా నుంచి కాపాడేందుకు హైదరాబాద్ ఫార్మా కంపెనీలు భారీ ఎత్తున వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వ సహకారం ఉంటుందని తెలంగాణ ఇండస్ట్రీస్, ఐటీఈఅండ్సీ ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేశ్ రంజన్ స్పష్టం చేశారు.