ప్రభుత్వ పెద్దల అవినీతి చిట్టా వామన్ రావు దగ్గర ఉంది.!అందుకే హత్య.!దుర్మార్గ ప్రభుత్వమన్న బండి సంజయ్.!
పెద్దపల్లి/హైదరాబాద్ : వామన్ రావు దంపతుల హత్య ఘటనపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్పందించాలని బీజేపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేసారు. ముఖ్యమంత్రి స్పందిచకపోతే ఈ హత్యలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యా రాజకీయాలపై రాష్ట్ర డీజీపిపి ఫిర్యాదు చేసేందుకు బీజేపి సన్నాహాలు చేస్తోందని తెలిపారు. అంతేకాకుండా మంథని ప్రాంతంలో జరుగుతున్న టీఆర్ఎస్ నాయకుల అక్రమాలపై విచారణ జరపాలని భారతీయ జనతా పార్టీ పట్టుబడుతోంది.
అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్నిస్తే హత్య చేస్తారా? పెద్దపల్లి హత్యలపై మండిపడ్డ బండి సంజయ్..
పెద్దపల్లి జిల్లాలో న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణి హత్యకు గురవ్వడం బాధాకరమని, ఆ ఘటన తీవ్రంగా కలిచివేసిందని బీజేపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేసారు. ఈ హత్యలకు అధికార పార్టీ నాయకులే కారణమని స్పష్టం చేసారు. వామన్ రావు దంపతుల హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్ పాలనలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, మోసాలకు వ్యతిరేకంగా చాలామంది బాధితులు అడ్వకేట్ దంపతులు వామన్ రావు, నాగమణిలను ఆశ్రయించారని, వీరిద్దరు నిజాయితీగా పేద ప్రజలకు అండగా నిలబడి న్యాయపరంగా పోరాడుతున్నందుకే హత్యకు గురయ్యారని బండి సంజయ్ తెలిపారు.
వామన్ రావు దంపతుల హత్యకు రాష్ట్ర ప్రభుత్వమే కారణం.. సీఎం స్పందించాలన్న రాష్ట్ర బీజేపి..
అంతే కాకుండా అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో జరిగిన అక్రమాలపై వామన్ రావు దంపతులు న్యాయపరంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిల్స్ వేశారని, అటు అనేక సంచలనాలకు సంబంధించి కేసులు కూడా వాదిస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. గతంలో శీలం రంగయ్య లాక్ అప్ డెత్ కేసులో వామన్ రావు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారని, ఈ క్రమంలో తమకు ప్రాణహాని ఉందని కోర్టును ఆశ్రయించగా వారికి పూర్తి రక్షణ కల్పించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని బండి సంజయ్ మండి పడ్డారు.
ఇది ప్రజాస్వామ్యమా.. రాక్షస పాలనా..? సీఎం వివరణ ఇవ్వాలన్న తెలంగాణ బీజేపి..
అంతే కాకుండా వామన్ రావు దంపతుల హత్యలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యలేనని బండి సంజయ్ తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి ఉండి ఉంటే వారి ప్రాణాలు పోయేవి కావని ఆవేదన వ్యక్తం చేసారు. టీఆర్ఎస్ ది దుర్మార్గ పాలనని, ప్రశ్నించే గొంతులను, అన్యాయాలను ఎదురించేవారిని అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. కొంతమంది మంథనికి చెందిన అధికార పార్టీ నాయకులు పథకం ప్రకారం వామన్ రావు దంపతులను హత్య చేసి ముఖ్యమంత్రి పుట్టినరోజున బహుమతిగా ఇచ్చారని తీవ్రంగా స్పందించారు బండి సంజయ్.
అడ్వకేట్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలి.. డిమాండ్ చేసిన బీజేపి అద్యక్షుడు..
వామన్ రావు దంపతుల హత్య ఘటన వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని, ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని తేల్చి చెప్పారు బండి సంజయ్. రాష్ట్రంలో న్యాయవాదులకే రక్షణ లేకుంటే.. ఇక సామాన్య ప్రజల పరిస్థితేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉందనడానికి ఈ ఘటనే సాక్ష్యమని, అసలు రాష్ట్ర ప్రభుత్వం వామన్ రావు దంపతులకు ఎందుకు రక్షణ కల్పించలేకపోయిందని నిలదీసారు. దీనికి రాష్ట్ర ప్ఱభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, కొంతమంది పోలీసు అధికారుల సాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి అరాచకాలకు పాల్పడుతోందని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేసారు. అడ్వకేట్ లకు బీజేపి అండగా ఉంటుందని తెలిపారు.