రాములమ్మ రాకడ కాస్త ఆలస్యం.!నెల రోజుల ముందైతే తన ఖాతాలో రెండు విజయాలు.!ఇప్పుడేంటి కర్తవ్యం?
హైదరాబాద్ : రాజకీయాల్లో చిత్రి విచిత్రి పరిణామాలు చోటుచేసుకుంటాయి. రాజకీయంగా తమతమ పార్టీలకు వీర విధేయులుగా ముద్ర వేసుకున్న నేతలు కూడా కొన్ని సందర్బాంల్లో అనాలోచిత నిర్ణాయాలు తీసుకుని భవిష్యత్తును అంధకారం చేసుకుంటారు. మరికొందరు మెరపులాంటి నిర్ణయాలు తీసుకుని ఉరుములా రెచ్చిపోతారు. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకున్న విజయశాంతి రాజకీయ గమనం కూడా ఒడిదొడుకుల మద్య కొనసాగిందని స్పష్టమవుతోంది. బీజేపితో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన రాములమ్మ గులాబీ పార్టీలో కొంత కాలం కొనసాగినా అక్కడ పూర్తి స్థాయిలో ఇమడలేక పోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె కొంతకాలం పార్టీకోసం పని చేసి తాజాగా భారతీయ జనతా పార్టీలో చేరారు.
కమలం పార్టీలో చేరిన విజయశాంతి.. ఇక ఫైర్ బ్రాండ్ రాజకీయాలు మొదలైనట్టేనా..?
సినీ పరిశ్రమలో కధానాయకిగా తనదైన మార్క్ చూపించిన విజయశాంతి, రాజకీయాల్లో ఆశించిన మేరకు రాణించలేక పోతున్నారనేది అక్షర సత్యం. ప్రధానంగా రాజకీయాల్లో నిలకడతో పాటు సహనం అవసరమని కొన్ని సందర్బాలు నిర్దారిస్తున్నాయి. సరిగ్గా ఇవే అంశాల్లో విజయశాంతి విఫలం చెందిందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో చోటుచేసుకుంది. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అదికారంలోకి వస్తుందని భావించిన విజయశాంతి ఆగమేఘాల మీద కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిణామాలు జగద్విదితమే.
తన మార్క్ చూపించుకోవడానికి చాలా సమయం ఉంది.. రెండు నెలల ముందైతే పరిస్దితి వేరుండేది..
రాజకీయాలే పరమావధిగా భావించిన చాలా మంది నేతలకు రాజకీయాలు అంతగా కలిసి రావనే ఉందంతాలు కూడా లేకపోలేదు. తెలంగాణ ప్రకటన తర్వాత కూడా విజయశాంతి గులాబీ పార్టీలో కొనసాగి ఉండి ఉంటే ఆమె రాజకీయ ప్రస్ధానం మరోలా ఉండేది. కాని తొందరపాటు నిర్ణయాలు వల్ల తాను ఊహించని పరిణామాలను ఎదుర్కోవల్సి వచ్చింది. తాజాగా రాజకీయంగా ప్రక్షాళన మొదలుపెట్టి అన్ని రాష్ట్రాల్లో బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీని కాదని భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు విజయశాంతి. ఇదే చేరిక కేవలం రెండు నెలల ముందు బీజేపిలో చేరితే ఆవిడ ఖాతాలో రెండు విజయాలు చేరిపోయి ఉండేవి.
సాధారణ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం.. రాములమ్మ వెయిట్ చేయక తప్పదు..
తెలంగాణలో అంతంత మాత్రంగా ఉన్న బీజేపి పట్టాలెక్కి పరుగులు తీస్తున్న క్రమంలో విజయశాంతి కమలం పార్టీలో చేరిపోయారు. లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు స్ధానాల్లో గెలుపొందడంతో బీజేపి విజయాల బాట పట్టినట్టు తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికతో పాటు మొన్న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించని అభ్యర్దుల గెలుపుకూడా తెలంగాణలో బీజేపి పార్టీకి వెయ్యి ఏనుగుల బలాన్ని తెచ్చిపెట్టింది. పార్టీ పగ్గాలు తీసుకున్న అనతి కాలంలోనే బండి సంజయ్ పార్టీని అనూహ్య విజయాల వైపు నడిపిస్తున్నారనే చర్చ కూడా చోటుచేసుకుంది. అంతే కాకుండా పార్టీ గెలుపు కోసం మహిళా నాయకురాలుగా డీకే అరుణ తన పాత్రను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది.
Recommended Video
రాములమ్మకు ఘన స్వాగతం.. కమల దళంలో కనిపిస్తున్న కొత్త ఉత్సాహం..
విజయశాంతి నవంబర్ నెలలో గనక బీజేపిలో చేరి ఉండి ఉంటే దుబ్బాక ఉప ఎన్నికతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల గెలుపు ప్రభావం, పార్టీ పటిష్టం వంటి అదనపు శుభ సందర్బాల్లో తన పాత్ర కీలకంగా మారి ఉండి ఉండేది. విజయశాంతి రాకడ బిజేపి పాలిట గోల్డెన్ లెగ్ అయ్యిందనే చర్చ కూడా జరిగి ఉండి ఉండేది. కాని ప్రస్తుత పరిస్ధితుల్లో ఎలాంటి ఎన్నికలు లేవు. సాధారణ ఎన్నికలకు మరో మూడేళ్ల సుధీర్గ సమయం ఉంది. ఈ లోపు రాములమ్మ పార్టీలో తన మార్క్ ను ఎలా నిరూపించుకుంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఉన్నప్పటికి దాంట్లో రాములమ్మ సీన్ ఎంతవరకు ఉంటుందనేది కూడా ప్రశ్నార్దకమే. కేవలం రెండు నెలలు ముందు బీజేపిలో చేరి ఉండి ఉంటు విజయశాంతికి బీజేపిలో అనూహ్య బ్రాండ్ వచ్చి ఉండేదనే చర్చ జరుగుతోంది.