కేసీఆర్ మీ మైండ్ గేమ్ పనిచేయదు, మునుగోడులో మరో ఓటమే: విజయశాంతి, ఈటల
నల్గొండ: సీఎం కేసీఆర్ లక్ష్యంగా బీజేపీ నేతలు ఈటల రాజేందర్, విజయశాంతి విమర్శలు గుప్పించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిక సందర్భంగా మునుగోడులో ఏర్పాటు చేసిన సమరభేరి సభలో విజయశాంతి, ఈటల రాజేందర్ పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ ఈ ఎనిమిదేళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు.

కేసీఆర్ భయపట్టుకుందంటూ విజయశాంతి
తెలంగాణ ఉద్యమ సమయంలో తన కుటుంబంలోని ఎవరూ కూడా రాజకీయాల్లో రారని చెప్పి.. ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో అందరికీ పదవులు కట్టబెట్టారని విజయశాంతి మండిపడ్డారు. తెలంగాణ కోసం పోరాడినవారిని తుంగలో తొక్కారన్నారు. దళిత సీఎం, దళితులకు 3 ఎకరాలు, ఇంటికో ఉద్యోగం, ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తానని నమ్మించి మోసం చేశారంటూ కేసీఆర్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నేనే డిజైన్ చేశాను. నేనే కడుతున్నానని.. వేల కోట్లు అప్పులు తీసుకున్నారు. కానీ, ఆ డబ్బంతా జేబులో వేసుకున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు కనీస వసతులు కల్పించాలని ఉద్యమం చేస్తే వారిని కూడా మోసం చేశారు. గురుకులాల్లో పురుగుల అన్నం పెడుతున్నారు. దీని కోసం మిమ్మల్ని సమర్థించాలా? కేసీఆర్ కు భయం పట్టుకుంది. ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదని విజయశాంతి మండిపడ్డారు.

కేసీఆర్ బీబీసీ తీసుకొస్తారంటూ విజయశాంతి
మోడీ ఆయనకు శత్రువట.. నిజమే, కానీ మోడీ ప్రజలకు మంచి మిత్రుడు అని అన్నారు విజయశాంతి. ఐటీ, సీబీఐ, ఈడీ వచ్చినా భయం లేదంటున్న కేసీఆర్.. ప్రతి వేదికపై ఇదే ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. లోలోపల భయపడుతున్నారు కాబట్టే చెబుతున్నారన్నారు. ప్రతి ఎన్నికల్లో కేసీఆర్ మాయమాటలు నమ్మి ఓట్లేసి మోసపోయిన ప్రజలు ఇక ఆ అవసరం లేదన్నారు. బీజేపీకి ఓట్లేసి ప్రజలకు మేలు చేసే ప్రభుత్వాన్ని తీసుకురావాలని కోరారు. కేసీఆర్ ప్రతి ఎన్నికల్లో బీబీసీ(బిర్యానీ, బ్రాండీ, కరెన్సీ) తీసుకొస్తారని.. బీబీసీ ఇచ్చి ఓట్లు వేయించుకుంటారన్నారు. నిన్నటి సభకు కూడా జనాన్ని ఇలానే తీసుకొచ్చారన్నారు. ప్రస్తుతం కేసీఆర్ గ్రాఫ్ పడిపోయిందన్నారు. మైండ్ గేమ్ ఆడుతూ బీజేపీలోని నాయకులను విడదీయాలని ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని మైండ్ గేమ్ లు ఆడినా బీజేపీ నేతలను విడదీయలేరని తేల్చి చెప్పారు. కేసీఆర్ ను గద్దె దించడమే తమ ఏకౌక లక్ష్యమని విజయశాంతి స్పష్టం చేశారు.

మునుగోడు గెలిస్తే కేసీఆర్ బంగాళాఖాతంలోకే: ఈటల రాజేందర్
మరోవైపు, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. మునుగోడు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిండని రాజేందర్ అన్నారు. ప్రజలు ఇచ్చిన ధైర్యంతో పదవి వదులుకున్న ఆయనను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. ఉప ఎన్నిక వస్తే మునుగోడులో హుజూరాబాద్ కన్నా గొప్ప తీర్పు వస్తుందని ఈటల ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ గడ్డ మీద బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ పార్టీని ఓడగొట్టాలని ఈటల పిలుపునిచ్చారు. మునుగోడు గడ్డ మీద బీజేపీ గెలిస్తే బంగాళాఖాతంలో వేస్తరని కేసీఆరే చెప్పుకుంటున్నాడని, అది తప్పకుండా జరుగుతదని చెప్పారు. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మోటర్లకు మీటర్లు పెడ్తరని అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. సీఎం చేస్తున్న ప్రచారం తప్పని హుజూరాబాద్లో నిరూపితమైందని చెప్పారు. వామపక్ష నాయకులు కేసీఆర్ తో కలవడం కన్నా హీనమైన చర్య మరొకటి లేదని ఈటల విమర్శించారు. ఇందిరా పార్కు వద్ద ధర్నాలు నిషేధించిన నాయకుడు కేసీఆర్తో పొత్తు పెట్టుకోవడాన్ని ఈటల రాజేందర్ తీవ్రంగా తప్పుబట్టారు. అలా చేస్తే తెలంగాణ ప్రజలు క్షమించరని అన్నారు. ట్రేడ్ యూనియన్లు సమ్మె చేస్తే సీఎం కేసీఆర్ ఏనాడైనా పిలిచి చర్చించి సమస్యను పరిష్కరించాడా అని నిలదీశారు.












Click it and Unblock the Notifications