హవ్వ.. ఇదేందబ్బా.. ఓటేసీ చెబుతారా.. అదీ చెల్లదు: రాములమ్మ
హోం మంత్రి మహమూద్ అలీపై ఫైర్ బ్రాండ్ నేత విజయశాంతి మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన హోం మంత్రి మహమూద్ అలీ ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వేశాననేది బహిరంగంగా ప్రకటించారని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కడమేనని విమర్శించారు. హోం మంత్రి ఓటు చెల్లదని స్పష్టం చేశారు.
మహమూద్ అలీపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ఆర్వో నుంచి ఫిర్యాదు అందించిన వెంటనే ఓటుపై పరిశీలిస్తామని అధికారులు తెలిపినట్టు వెల్లడించారు. తాను ఎవరికి ఓటేశానో హోం మంత్రే స్వయంగా మీడియాకు చెప్పిన తర్వాత వెంటనే చర్యలు తీసుకోకుండా ఫిర్యాదు కోసం ఎదురుచూడడం ఏంటో అర్థం కావడం లేదని విజయశాంతి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదేం పాలనో అర్థం కావడం లేదని చెప్పారు.

లోక్ సభ సభ్యులు, ఎమ్మెల్యేల ఎన్నికలకు వ్యయ పరిమితిని విధించిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్సీల విషయంలో అలాంటిదేమీ విధించలేదు. దీంతో టీఆర్ఎస్ పార్టీ కోట్లు కుమ్మరించిందని విజయశాంతి ఆరోపించారు. ప్రకటనలు, ప్రచారం, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేశారని వెల్లడించారు.
భైంసా ఘటనపై కూడా విజయశాంతి స్పందించారు. రాజ్యాంగ వ్యవస్థలు అంటే తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులకు ఏ మాత్రం పట్టదని విమర్శించారు. పాలనను గాలికొదిలేశారని, తరచుగా హింసకు గురవుతున్న భైంసా పట్టణమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. హత్యలు, దాడులతో భైంసా ప్రజలు బిక్కుబిక్కుమని బతుకుతుంటే, సీఎం కేసీఆర్ మాత్రం రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తిని గుర్తుకు తెస్తున్నాడని కామెంట్ చేశారు.












Click it and Unblock the Notifications