దళితుడిగా ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యమా.. వివేక్ అంచనాలు తప్పుతున్నాయా?
హైదరాబాద్ : గడ్డం వివేకానంద అలియాస్ వివేక్ కుటుంబం కాంగ్రెస్ పార్టీ వీరవిధేయులుగా ముద్రపడ్డారు. గడ్డం వెంకటస్వామి అలియాస్ కాకా కొడుకుగా వివేక్ కాంగ్రెస్ పార్టీకి చాలాకాలం పాటు సేవలందించారు. అయితే పెద్దాయన మరణానంతరం వివేక్ నిలకడగా ఉండట్లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కారెక్కి.. ఆ తర్వాత అక్కడ పొసగక తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చారు. మళ్లీ ఏమైందో.. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ గులాబీవనంలో చేరిపోయారు. అయితే ఎన్నికల తర్వాత మళ్లీ కారు దిగేశారు వివేక్. ఇప్పుడేమో బీజేపీతో జతకట్టి ముందుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.

కాంగ్రెస్ వీరవిధేయుల కుటుంబం
గడ్డం వెంకటస్వామి అలియాస్ కాకా కాంగ్రెస్ పార్టీలో ఆరితేరారు. ఆ పెద్దాయనంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ శ్రేణుల్లో భయం, భక్తి రెండూ ఉండేవి. ఆ క్రమంలో ఆయన కొడుకు వివేక్ కూడా చాలాకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. అయితే తదనంతర కాలంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం నిలకడగా ఉండట్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చాలా ఈజీగా పార్టీ కండువాలు మార్చేస్తూ రాజకీయ చౌరస్తాలో నిలబడ్డారు వివేక్.
Recommended Video

కరడుగట్టిన కాంగ్రెస్వాది కాకా.. వివేక్ కూడా చాలాకాలంగా..!
కరడుగట్టిన కాంగ్రెస్వాదిగా, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుటుంబానికి దగ్గరి వ్యక్తిగా వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నో పదవులు సొంతం చేసుకున్నారు. ఆయన రాజకీయ వారసుడిగా తెరంగేట్రం చేసిన వివేక్ చాలాకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పెద్దపల్లి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అయితే రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే తపన ఆయన్ని కుదురుగా ఉండనివ్వడం లేదనే వాదనలు లేకపోలేదు. అందుకే వివేక్ ఎప్పటికప్పుడూ కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారని.. కానీ, అవి బెడిసికొట్టడంతో ఆయన నిర్ణయాలు నిలకడగా ఉండటం లేదనే ప్రచారం జరుగుతోంది.

జంప్లే జంపులు. అటు ఇటుగా కారు, హస్తం..!
2009లో కాంగ్రెస్ నుంచి పెద్దపల్లి ఎంపీగా గెలిచారు వివేక్. అయితే తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజీకి చేరిన దరిమిలా కాంగ్రెస్కు గుడ్బై చెప్పి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పట్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దళితుణ్ని ముఖ్యమంత్రి చేస్తామన్న వ్యాఖ్యలతో ఆయన టీఆర్ఎస్ వైపు మళ్లారనే టాక్ వినిపించింది. అయితే 2014లో రాష్ట్ర విభజన, టీఆర్ఎస్ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. ఆ క్రమంలో కేసీఆరే సీఎం కుర్చీపై కూర్చున్నారు.
టీఆర్ఎస్లో ఇమడలేకపోయిన వివేక్ అనూహ్యంగా 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామంటూ సోనియాగాంధీ చేసిన ప్రకటనతో యూ టర్న్ తీసుకున్నారనే ప్రచారం జోరుగా సాగింది.

కేబినెట్ హోదా.. మళ్లీ అప్పుడే ఏమైందో..!
2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేశారు వివేక్. ఆయనకు పోటీగా విద్యార్థి నాయకుడు బాల్క సుమన్ను రంగంలోకి దించింది టీఆర్ఎస్. ఆ క్రమంలో వంద కోట్లున్న వివేక్కు ఓటేస్తారా.. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడి వంద కేసులున్న నాకు ఓటేస్తారా అంటూ బీభత్సంగా ప్రచారం చేశారు సుమన్. దాంతో కారుకు గంపగుత్తగా ఓట్లు పడి వివేక్ ఓటమి చవిచూశారు. మళ్లీ ఏమైందో ఏమో గానీ.. 2017లో సింగరేణి ఎన్నికల వేళ మరోసారి టీఆర్ఎస్ గూటికి చేరారు వివేక్. ఆ క్రమంలో ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ హోదా కట్టబెట్టారు సీఎం కేసీఆర్.

టీఆర్ఎస్లో ఉంటూ కాంగ్రెస్ అభ్యర్థులకు సాయం చేశారట..!
అయితే ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఆర్థికసాయం చేశారనే ఆరోపణలు మూటగట్టుకున్నారు వివేక్. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పీఠంపై కలలుగంటున్న తనకు.. ఆ ఎమ్మెల్యేలు ఉపయోగపడతారనే కారణంతో అలా చేసి ఉంటారనే టాక్ నడిచింది. అయితే వివేక్ తిరిగి టీఆర్ఎస్లో చేరితే గౌరవించి మంచి పదవి కట్టబెడితే వెన్నుపోటు పొడిచేలా ప్రవర్తించారని కేసీఆర్ గరమైనట్లు ప్రచారం జరిగింది. ఆ క్రమంలో లోక్సభ ఎన్నికల వేళ పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించిన వివేక్కు భంగపాటు తప్పలేదు. టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో అవమానంగా భావించి మరోసారి పార్టీకి గుడ్బై చెప్పేశారు.

బీజేపీతో ముందడుగు.. కలిసొచ్చేనా ఈసారైనా..!
లోక్సభ ఎన్నికల వేళ టీఆర్ఎస్ పార్టీకి వివేక్ గుడ్బై చెప్పడంతో ఆయనకు కాషాయం కండువా కప్పేందుకు బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. పెద్దపల్లి నుంచి బీజేపీ తరపున ఎంపీగా పోటీచేయాలని వివేక్ను ఎంతకోరినా ఆయన ఒప్పుకోలేదు. ఆ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వివేక్ను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అయితే ఇన్నాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తటస్థంగా ఉన్న వివేక్.. ఎవరూ ఊహించని విధంగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
కొన్నాళ్లుగా నిలకడలేని నిర్ణయాలు తీసుకుంటూ.. వివేక్ తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టారనే వాదనలు లేకపోలేదు. అనాలోచిత నిర్ణయాలతో రాజకీయంగా వెనుకబడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో బలం పుంజుకుని అధికారం దిశగా అడుగులేస్తున్న బీజేపీ జోష్ చూసి ఆయన కమల తీర్థం పుచ్చుకున్నారేమోననే ప్రచారం జరుగుతోంది. మరి ఈసారైనా ఆయన వేసిన ముందడుగు సత్ఫలితాలు ఇస్తుందా లేదంటే తప్పటడుగులా మారుతుందా చూడాలి.












Click it and Unblock the Notifications