Disha case encounter: గర్వంగా ఉంది, నిబద్ధత గల అధికారి: సీపీ సజ్జనార్ సోదరుడు
బెంగళూరు/హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులను సైబరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలోని పోలీసులు శుక్రవారం ఉదయం ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా సీపీ సజ్జనార్, తెలంగాణ పోలీసులపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.

గర్వంగా ఉంది..
ఈ నేపథ్యంలో సీపీ సజ్జనార్ సోదరుడు డాక్టర్ ఎన్సీ సజ్జన్ స్పందించారు. తమ సోదరుడు చేసిన పనికి తమతోపాటు తమ స్వగ్రామంలోని వారంతా గర్వంగా భావిస్తున్నారని సజ్జన్ తెలిపారు. అయితే, ఈ ఘటనపై తాను స్పందించనని అన్నారు.

నిబద్ధత గల అధికారి..
సజ్జనార్ ఒక సిన్సియర్, వృత్తి నిబద్ధత గల అధికారి అని సజ్జన్ వ్యాఖ్యానించారు. సజ్జనార్ కాలేజీ రోజుల నుంచి సామాజిక కార్యకర్తగా ఎదిగారని, ఆయన తన కాలేజీకి ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరించారని తెలిపారు. సజ్జనార్ మృధుభాషి అని, క్రమశిక్షణ గల వ్యక్తని అన్నారు.

మొదట పులివెందులలో డీఎస్పీగా..
సజ్జనార్ తమ ఇంటికి తరచుగా వస్తుంటారని సజ్జన్ తెలిపారు. లైఫ్స్ స్కూల్ ప్రాథమిక విద్యను అభ్యసించిన సజ్జనార్.. ఆ తర్వాత జగద్గురు గంగాధర్ కామర్స్ కాలేజీ నుంచి పీయూసీ, ఎంబీఏ పూర్తి చేశారు. అనంతరం సజ్జనార్ యూపీఎస్సీ పరీక్షలో విజయవంతమయ్యారని తెలిపారు. మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పులివెందులలో సజ్జనార్ డీఎస్పీగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారని ఆయన సోదరుడు సజ్జన్ తెలిపారు.

నిందితుల ఎన్కౌంటర్ ఇలా..
కాగా, దిశను అత్యారం చేసి, హత్య చేసిన కేసులో నిందితులు మహ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు నవీన్, జొల్లు శివను శుక్రవారం తెల్లవారుజామున దిశ హత్య జరిగిన చటాన్పల్లి బ్రిడ్జి దగ్గరకు తీసుకెళ్లారు పోలీసులు. ఆ తర్వాత ఆమెకు సంబంధించిన సెల్ఫోన్, వాచీ, పవర్ బ్యాంక్ పాతిపెట్టిన ప్రదేశాలను చూపించారు.
ఈ సమయంలోనే నలుగురు నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. రాళ్లు, కర్రలతో పోలీసులపై దాడి చేశారు. అంతేగాక, పోలీసుల దగ్గర్నుంచి తుపాకీలను లాక్కున్నారు మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు. లొంగిపోవాలంటూ పోలీసులు కోరినప్పటికీ నిందితులు వినకుండా కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఎదురుకాల్పులు జరిపి నలుగురు నిందితులను మట్టుబెట్టారు. నిందితులు రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో ఓ ఎస్ఐ, కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. వారు హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు వివరాలను సీపీ సజ్జనార్ శుక్రవారం సాయంత్రం మీడియాకు తెలియజేశారు .












Click it and Unblock the Notifications