ఇంతకీ ఏం జరిగింది..? కస్తూర్బా గాంధీ గ్యాస్ లీక్ ఇష్యూపై ఎంక్వైరీ,
సికింద్రాబాద్ కస్తూర్బా గాంధీ కాలేజీలో కెమికల్ గ్యాస్ లీక్ ఇష్యూ మిస్టరీగా మారింది. విద్యార్థినులు ఎందుకు అస్వస్థతకు గురయ్యారనే అంశం అంతుచిక్కని ప్రశ్నగా మారింది. మొదట కాలేజీ సైన్స్ ల్యాబ్ నుంచి గ్యాస్ లీక్ అయిందని తెలిసింది. యాజమాన్యం మాత్రం అసలు సైన్స్ ల్యాబ్ ఓపెన్ చేసే లేదని చెబుతోంది. బయటి నుంచి వచ్చిన గ్యాస్ వల్లే విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారని అంటోంది.
క్లూస్ టీమ్తో పోలీసులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. కాలేజీ పరిసరాలతోపాటు ల్యాబ్ పరిశీలించారు. యాజమాన్యం, విద్యార్థినులతో మాట్లాడి వివరాలు సేకరించారు. గ్యాస్ ఎక్కడి నుంచి లీక్ అయ్యింది? విద్యార్థినులు ఎలా స్పృహ తప్పి పడిపోయారనే అంశాలపై ఆరా తీస్తున్నారు. తమ పిల్లలకు ఏం జరిగిందో తెలియక పేరంట్స్ భయాందోళన చెందుతున్నారు.
కస్తూర్బా కాలేజీలో విష వాయువు లీక్ కావడం, 14 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయిన సంగతి తెలిసిందే. ఈ విషయం కలకలం రేపింది. విద్యార్థులు సైన్స్ ల్యాబ్లో ప్రయోగాలు చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో స్పృహ తప్పి పడిపోయారని వార్తలొచ్చాయి. కానీ ఏం జరిగిందో తెలియరాలేదు. అస్వస్థతకు గురయిన విద్యార్థినులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గ్యాస్ లీక్ అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏం జరిగిందనే అంశంపై తేల్చనున్నారు. కానీ అప్పటివరకు మాత్రం మిస్టరీ కొనసాగుతోంది. దీనిపై పేరంట్స్ ఆందోళన చెందుతున్నారు. వందలాది మంది కాలేజీ వద్దకు చేరుకుంటున్నారు.