వీఆర్వోల అంశంలో తుది నిర్ణయం కలెక్టర్లదా..? సీఎందా..? తెలంగాణలో ఏం జరుగుతోంది..!!
హైదరాబాద్ : తెలంగాణలో కలెక్టర్స్ వర్సెస్ సీఎంవో అనే పరిస్థితులు నెలకొన్నట్టు తెలుస్తోంది. వీఆర్వో వ్యవస్థ గురించి భిన్నాభిప్రాయాలు నెలకొన్నట్టు చర్చ జరుగుతోంది. తెలంగాణలో దాదాపు 10వేల రెవెన్యూ గ్రామాలున్నాయి. గ్రామానికి ఒక వీఆర్వో ఉండాలి. కానీ ఉన్నది 5900మంది వీఆర్వోలు. ఇక వీరికింద 22వేల మంది వీఆర్ఏలు ఉన్నారు. గడిచిన 8 నెలల కాలంలో ఏకంగా 25 మందికి పైగా వీఆర్వోలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఇంత విచ్చలవిడి వీఆర్వోల అవినీతి ప్రభుత్వానికి ప్రతికూల పరిస్థితులను కల్పిస్తోంది. లంచావతారులుగా మారి కోట్లు కొల్లగొడుతున్న వీఆర్వోల వ్యవస్థనే రద్దు చేయాలని సీఎం చంద్రశేఖర్ రావు పట్టుదలతో ముందుకెళ్తున్నారు. కానీ చంద్రశేఖర్ రావు ఆశలపై నీళ్లు చల్లేలా జిల్లా కలెక్టర్లు వ్యవహరించడం తెలంగాణ అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా జిల్లా కలెక్టర్లతో చంద్రశేఖర్ రావు రెండు రోజుల సమీక్ష నిర్వహించారు. మీటింగ్ లోనే వివరాలేవీ బయటకు చెప్పవద్దని గోప్యత పాటించాలని చంద్రశేఖర్ రావు స్పష్టంగా సూచించారట.. అందుకే ఆలస్యంగా ఒక వార్త బయటకు వచ్చింది. అదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
కొత్త రెవెన్యూ చట్టం తెస్తున్న చంద్రశేఖర్ రావు, వీఆర్వోలను సమూలంగా తొలగించాలని కలెక్టర్ల సదస్సులో ప్రతిపాదించారట. వీఆర్వోలు అవసరమా అన్న చంద్రశేఖర్ రావు ప్రశ్నకు 90శాతం మంది కలెక్టర్లు అవసరమేనని కుండబద్దలు కొట్టడం విశేషంగా చెప్పుకుంటున్నారు. గ్రామస్థాయిలో రెవెన్యూ ఇతర ధ్రువీకరణకు వీఆర్వోలే కీలకమని, వారు లేకపోతే పనులు జరగడం కష్టమని, తమకు వారే కీలకమని అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది. అవినీతి గురించి పట్టని కలెక్టర్లు తమ పనులు చక్కబెట్టుకునే ఉద్యోగిగానే వీఆర్వోలను చూడడం గమనార్హం. కానీ చంద్రశేఖర్ రావు మాత్రం కలెక్టర్లకు చేదోడుగా ఉండే వీఆర్వోలలోని లంచావతారులను ఏరివేయడానికి రెడీ అయ్యారు. అయితే కలెక్టర్లు మాత్రం వాళ్లు ఉండాల్సిందేనని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఒకరిద్దరు కలెక్టర్లు మాత్రమే వీఆర్వోలు వద్దంటూ చంద్రశేఖర్ రావు కు సపోర్టు చేశారట. ఇలా చంద్రశేఖర్ రావు నిర్ణయానికే వ్యతిరేకంగా వ్యవహరించిన కలెక్టర్లు తీరు చర్చనీయాంశంగా మారింది. వీఆర్వో వ్యవస్థను తీసివేయాలనుకుంటున్న చంద్రశేఖర్ రావు నిర్ణయానికి కలెక్టర్లు నో చెప్పడం ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ గా మారింది.