రెబల్స్పై టీఆర్ఎస్ వ్యూహమేంటి : తిరిగి చేర్చుకుంటారా..? సస్పెండ్ చేస్తారా..?
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. కొత్త పాలకమండళ్లు కూడా కొలువుదీరాయి. కానీ రెబల్స్ విషయంలోనే అధికార పార్టీ నుంచి ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు. ఎన్నికలకు ముందు రెబల్స్ను తిరిగి పార్టీలో చేర్చుకునేది లేదని తేల్చి చెప్పిన టీఆర్ఎస్ అధిష్టానం.. ఇప్పుడు పునరాలోచనలో పడిందా అన్న చర్చ జరుగుతోంది.
రెబల్స్పై వేటు వేయాలని పార్టీ నేతల నుంచి మంత్రి కేటీఆర్పై ఒత్తిడి ఉంది. తమకు వ్యతిరేకంగా పోటీ చేసి తమను ఓడించారని.. ఇలాంటి చర్యలను ఉపేక్షిస్తే పార్టీకి నష్టమని వారు వాపోతున్నారు. ఇప్పటికే కొల్లాపూర్ సహా ఆయా మున్సిపాలిటీల పరిధిలో రెబల్స్గా వ్యవహరించినవారి జాబితా కేటీఆర్కు చేరింది. అయినప్పటికీ రెబల్స్ విషయంలో పార్టీ అధిష్టానం నుంచి ఇప్పటికీ ఎటువంటి స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఆసక్తికర చర్చ తెర పైకి వచ్చింది. రెబల్స్పై వేటు వేయడం ద్వారా ఇప్పుడు పార్టీకి లాభమేంటని పార్టీ అధిష్టానం భావిస్తోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే కొంతకాలం రెబల్స్పై సైలెంట్ గానే ఉండాలన్న ఆలోచనలో ఉందన్న వాదన వినిపిస్తోంది.

అయితే మరో ఏడాదిలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా ఉన్న విషయాన్ని పార్టీ అధిష్టానం సీరియస్గా పరిగణిస్తోందన్న చర్చ కూడా జరుగుతోంది. ఇప్పుడు రెబల్స్పై చర్యలు తీసుకోకుండా వదిలిపెడితే.. భవిష్యత్తులో దాని ఎఫెక్ట్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై పడవచ్చునని భావిస్తున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు టీఆర్ఎస్కు ప్రతిష్టాత్మకం కాబట్టి ఇప్పటినుంచే రెబల్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం. దీనిపై త్వరలోనే పార్టీ సీనియర్లతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.కాగా,మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 110 మున్సిపాలిటీలు,9 కార్పోరేషన్లను టీఆర్ఎస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలు,స్థానిక సంస్థల ఎన్నికలు,మున్సిపల్ కార్పోరేషన్ల ఎన్నికల్లో వరుస ఘన విజయాలతో టీఆర్ఎస్ జోరు మరింత పెరిగింది.












Click it and Unblock the Notifications