ముంచుకొస్తున్న మేయర్ ముహూర్తం.!సీల్డ్ కవర్ లో ఉన్న స్త్రీ ఎవరు.?మజ్లిస్ మతలబు ఏంటి..?
హైదరాబాద్ : మేయర్ ఎంపిక ప్రక్రియకు ముహూర్తం ముంచుకొస్తోంది. ఈనెల 11న మేయర్ ఎన్నిక లాంఛనం పూర్తి కావల్సిన ఉన్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ మేయర్ అభ్యర్థి అంశంలో తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. మేయర్ అభ్యర్ధి ఎంపికలో మజ్లిస్ మద్దత్తు తీసుకోబోమని గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో 54మంది కార్పోరేటర్లు ఉన్న మజ్టిస్ పార్టీ ఎవరికి మద్దత్తునిస్తుంది, మేయర్ ఎన్నికరోజు ఆ పార్టీ అనుసరించబోయే వ్యూహం ఏంటి అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
Recommended Video
రసకందాయంలో మేయర్ ఎన్నిక.. మజ్లిస్ తప్పుకుంటుందా.. తప్పిస్తారా..?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి మజ్లిస్ పార్టీ పాత్ర కీలకంగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించకపోవడంతో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సమస్యగా పరిణమించింది. మజ్లిస్కు మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలపై పెద్దగా ఆశలు లేకపోవడంతో పాటు అందుకు తగినంత సంఖ్యా బలం లేకుండాపోయింది. అధికార టీఆర్ఎస్తో దోస్తీ ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగింది. ఒకానొక సందర్బంలో ఇరు పక్షాలు పరస్పర విమర్శలు కూడా చేసుకున్నారు.
అధికార పార్టీ వ్యూహం ఏంటి.. మజ్లిస్ మద్దత్తు తీసుకుంటుందా..తీసుకోదా..?
ఈ ప్రభావంతో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో మద్దతు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు బీజేపీకి మజ్లిస్ మద్దతు ఇచ్చే ప్రసక్తి ఉండదు. అలాగే టీఆర్ఎస్కు ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చేందుకూ ఆ పార్టీ సిద్ధంగా లేదు. ఇందుకు వ్యతిరేకంగానూ ఓటు వేసే అవకాశాలు కనిపించడం లేదు. ఈ క్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లో పాల్గొనే అంశంపై మజ్లిస్ తర్జనభర్జన పడుతోంది. సమావేశం నుంచి వాకౌట్ చేయడమా? మొత్తానికే గైర్హాజర్ కావడమా అనే అంశాలపై లోతుగా చర్చించి ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది మజ్లిస్ పార్టీ.
మజ్లిస్ సంఖ్యాబలం 54.. ఎవరికి మద్దత్తో రాని స్పష్టత..
ఇదిలా ఉండగా బల్దియాలో మజ్లిస్ సంఖ్యా బలం 54మంది కార్పోరేటర్లు. ఇందులో 44 మంది కార్పొరేట్లరతో పాటు 10 మంది ఎక్స్అఫీషియో సభ్యులు ఉన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఓటు హక్కు ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 193 కాగా, కోరం సంఖ్య 97. ఎక్స్అఫీషియో సభ్యులతో కలుపుకొంటే టీఆర్ఎస్ సంఖ్యాబలం 88కు మించదు. దీంతో మజ్లిస్ పాత్ర కీలకంగా మారింది. కాని మజ్లిస్ పార్టీ మద్దత్తు కోరే పరిస్థితిలో గులాబీ పార్టీ ఉన్నట్టు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మొత్తం ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
దూరం పాటించడమే.. దారుస్సలాం సమవేశం కీలకం..
జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియకు దూరం పాటించాలని మజ్లిస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకరణ అనంతరం మేయర్ ఎన్నికల కోసం జరిగే ప్రత్యేక సమావేశం నుంచి నేరుగా వైదొలగడమా? ప్రత్యేక సమావేశానికి గైర్హాజరు కావడమా? అనే అంశాలపై ఆ పార్టీ తర్జనభర్జన పడుతోంది. పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో ఈ నెల 11న ఉదయం జరిగే కార్పొరేటర్ల ప్రత్యేక సమావేశంలోనే అధినేత అసదుద్దీన్ ఒవైసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అవలంబించే వ్యూహంపై స్పష్టతనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటి వరకూ ఉత్కంఠ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.