YS Sharmila: అన్న ఆంధ్రాలో... నేను తెలంగాణలో... టార్గెట్ టీఆర్ఎస్... !
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయ,ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ గురించి తేల్చేశారు. తెలంగాణలో తాను పార్టీ పెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చి ఎన్నేళ్లయింది... రాష్ట్రంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారంటూ పరోక్షంగా టీఆర్ఎస్ను టార్గెట్ చేశారు. విద్యార్థులు,నిరుద్యోగులు,రైతులు... ఎవరు సంతోషంగా ఉన్నారు చెప్పండంటూ మీడియానే ఆమె ఎదురు ప్రశ్నించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలని... ఆ దిశగానే తన ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు. ఇందుకోసం త్వరలోనే అన్ని జిల్లాల్లో వైఎస్సార్ అభిమానులతో భేటీ కానున్నట్లు చెప్పారు. లోటస్పాండ్లో ఉమ్మడి నల్గొండ జిల్లా వైఎస్సార్ అభిమానులతో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
నాకు గ్రౌండ్ రియాలిటీ తెలియదు : షర్మిల
అంతకుముందు,లోటస్పాండ్ భేటీలో షర్మిల మాట్లాడుతూ...'నాకు క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలియవు... మీ సలహాలు,సూచనలు నాకివ్వండి... నేను మాట్లాడటానికి రాలేదు... మీరు చెప్పింది వినడానికే వచ్చాను.' అని వెల్లడించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పని ఆయన చేసుకుంటున్నారు... నేను తెలంగాణ కోసం చిత్తశుద్దిగా పనిచేయాలనుకుంటున్నానని చెప్పారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామని తెలిపారు. కొత్త పార్టీ వైసీపీకి అనుబంధంగా ఉంటుందా లేదా అన్న దానిపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిపారు.
అన్నతో విభేదాల్లేవ్..
షర్మిల కొత్త పార్టీ అనే ఊహాగానాలు కొంతకాలంగా బలంగా వినిపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె అన్న జగన్కు వ్యతిరేకంగా రంగంలోకి దిగబోతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ ప్రచారాలను పటాపంచలు చేస్తూ అన్నతో తనకెటువంటి విభేదాలు లేవని షర్మిల తేల్చేశారు. అన్న ఆంధ్రాను ఏలితే... తాను తెలంగాణను ఏలాలనుకుంటున్నానని చెప్పేశారు. ఇప్పటికే కొత్త పార్టీకి సంబంధించి ఎన్నికల కమిషన్కు షర్మిల దరఖాస్తు కూడా చేసుకున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆ వివరాలు మీడియా ముఖంగా షర్మిల వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ బలహీనపడినందువల్లే....
తెలంగాణలో దుబ్బాక,జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం రాష్ట్ర రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్గా కనిపిస్తోంది. టీఆర్ఎస్ జనంలో బలహీనపడిందని గుర్తించిన షర్మిల... తెలంగాణలో వైఎస్సార్ అభిమానులను ఏకం చేయడం ద్వారా రాజన్న రాజ్యం దిశగా కదలాలని యోచిస్తున్నారు. షర్మిల పార్టీ ఆలోచన వెనుక ఆమె భర్త బ్రదర్ అనిల్ అన్నీ తానై వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు షర్మిల తెలంగాణలో పార్టీ గురించి తేల్చేయడంతో తెలంగాణ వాదులు,టీఆర్ఎస్,కాంగ్రెస్ నేతలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్నే వ్యతిరేకించిన వైఎస్సార్ పేరుతో తెలంగాణలో రాజకీయం చెల్లదని అంటున్నారు.