క్యాన్బెర్రా..టీమిండియాకు పీడకల: పేకమేడలా బ్యాటింగ్ లైనప్: వెంటాడుతోన్న ఆ మ్యాచ్: సేమ్ సీన్?
క్యాన్బెర్రా: సుదీర్ఘ విరామం అనంతరం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న భారత క్రికెట్ జట్టు.. వన్డే సిరీస్ను ఎలాగూ పోగొట్టుకుంంది. బ్యాక్ అండ్ బ్యాక్ పరాజయాలను చవి చూసింది. ఇక పరువు నిలుపుకోవడానికి పోరాడాల్సి వస్తోంది. కాస్సేపట్లో ఆస్ట్రేలియా జట్టును ఢీకొనబోతోంది కోహ్లీసేన. క్యాన్బెర్రాలోని మనూకా ఓవల్ స్టేడియం ఈ మ్యాచ్కు వేదికగా మారింది. ఈ స్టేడియంలో ఆడిన కొన్ని మ్యాచ్లు టీమిండియాకు పీడకలా మారాయి. ఇప్పటికీ వెంటాడుతున్నాయి. ఆస్ట్రేలియాకు బాగా అచ్చొచ్చిన పిచ్ ఇది. ఆ ట్రెడీషన్ను టీమిండియా బ్రేక్ చేస్తుందా? లేదా? అనేది సాయంత్రానికి తేలిపోతుంది.
ఓటమి తెలియని ఆసీస్..
క్యాన్బెర్రా స్టేడియంలో ఆస్ట్రేలియా జట్టుకు తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటిదాకా ఆడిన ఏ ఒక్క మ్యాచ్ను కూడా ఆసీస్ జట్టు ప్రత్యర్థికి సమర్పించుకోలేదు. మొత్తం ఆరు అంతర్జాతీయ మ్యాచ్లు క్యాన్బెర్రాలోని మనూకా ఓవల్ స్టేడియంలో జరిగాయి. ఆందులో నాలుగు వన్డేలు. ఈ ఆరుకు ఆరింటినీ గెలుచుకోగలిగింది టీమ్ ఆస్ట్రేలియా. ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించగలిగింది. ఈ సారి కూడా అదే పట్టును నిలుపుకోవడానికి ఉవ్విళ్లూరుతోంది. సమరోత్సాహంతో బరిలోకి దిగబోతోంది. ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో 400 వరకు పరుగుల చేసిన ఊపును కొనసాగించడానికి సమాయాత్తమౌతోంది.
ఆ ఓటమి తరువాత.. మళ్లీ ఇదే తొలిసారి
క్యాన్బెర్రా స్టేడియంలో భారత జట్టు రికార్డులేమీ బాగోలేవు. ఆస్ట్రేలియాతో జరిగిన ఓ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లో అద్భుత ఆరంభాన్ని అందిపుచ్చుకున్నప్పటికీ.. ఆ దూకుడును కొనసాగించలేకపోయింది టీమిండియా. చివరి తొమ్మిది వికెట్లను కేవలం 46 పరుగులకే కోల్పోయింది. చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంది. ఆ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ సెంచరీలను బాది పారేసినప్పటికీ.. మిగిలిన బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలిపోవడంతో పరాజయాన్ని చవి చూసింది.
348 పరుగుల భారీ స్కోర్..
2016 జనవరి 20వ తేదన క్యాన్బెర్రాలో జరిగిన మ్యాచ్ అది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 348 పరుగులను చేసింది. ఓపెనర్లు ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్వేల్ భీకరంగా చెలరేగి ఆడారు ఆ మ్యాచ్లో ఫించ్-107, వార్నర్ 93, స్టీవ్ స్మిత్ 51, మ్యాక్స్వెల్-41 పరుగులు చేశారు. అనంతరం 349 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా అద్భుతంగా ఆడింది. శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ సెంచరీలను నమోదు చేశారు.
277/1 స్థాయి నుంచి
వికెట్ నష్టానికి 277 పరుగుల వద్ద ఉన్న స్థాయి నుంచి 323 పరుగులకే జట్టు మొత్తం పెవిలియన్కు చేరింది. జట్టు స్కోరు 277 పరుగుల వద్ద శిఖర్ ధావన్ అవుట్తో ఆరంభమైన వికెట్ల పతనం.. ఎక్కడా ఆగలేదు. చివరి తొమ్మిది వికెట్లను 46 పరుగులకే కోల్పోయింది. ఓటమిని మూటగట్టుకుంది. ఇప్పుడు కూడా అదే తరహా పరిస్థితులు క్యాన్బెర్రాలో కనిపిస్తున్నాయి. టాస్ గెలిస్తే మాత్రం మ్యాచ్ను వదులుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది కోహ్లీసేన. ఈ సిరీస్లో తొలి రెండు వన్డేల్లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు ఏ రేంజ్లో ఆడిందో తెలిసిన విషయమే. 2016 జనవరి నాటి వన్డే మ్యాచ్ సీన్ రిపీట్ కావడానికే అవకాశాలు కనిపిస్తున్నాయి. డేవిడ్ వార్నర్ అందుబాటులో లేకపోవడం ఒక్కటే భారత్కు ఊరట కలిగిస్తోంది.