కరోనా: 24 గంటల్లో 1975 కొత్త కేసులు.. రికవరీ రేటులో భారత్ రికార్డు.. మొత్తంగా 6.25 లక్షల టెస్టులే..
కరోనా విలయం దెబ్బకు ప్రపంచమంతా నిరాశలో కూరుకుపోయినవేళ.. భారత్ లో ఆ వ్యాధి నుంచి కోలుకుంటున్నవాళ్ల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. అయితే ఇది సంబరపడాల్సిన విషయం ఏమాత్రం కాదు. అమెరికాలో ప్రతి 10 లక్షల మందిలో 15,000 మందికి కరోనా టెస్టులు నిర్వహిస్తుంటే, మన దగ్గర మాత్రం ఆ సంఖ్య కేవలం 420గా ఉంది. ర్యాపిడ్ టెస్టుల సంఖ్య పెంచితేగానీ, మన వాస్తవ పరిస్థితి బయటపడే అవకాశంలేదు. ఇదిలా ఉంటే, ఇండియాలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1975 కొత్త కేసులు, 47 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 26,917కు, మరణాల సంఖ్య 826కు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
10 రోజుల్లో 10 శాతం పెరుగుదల..
కొత్త కేసుల నమోదు భారీగా ఉండటంతోపాటు కొవిడ్-19 నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. ఆదివారం నాటికి కేసుల సంఖ్య 26,917కాగా, అందులో 6వేలపైచిలుకు మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఈనెల 16న రికవరీ రేటు 12 శాతంగా ఉండగా, 10 శాతం పెరుగుదలతో ఆదివారం(26వ తేదీ) నాటికి 22 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సంయుక్తంగా వెల్లడించాయి. గడిచిన 24 గంటల్లో రికవరీల సంఖ్య 704గా ఉందన్నారు. 10 రోజుల వ్యవధిలో రికవరీ రేటు 10 శాత పెరగడం రికార్డేనని చెప్పారు.
అందులో మాత్రం వీక్..
ముందస్తుగానే లాక్ డౌన్ ప్రకటించిన కారణంగా భారత్ లో వైరస్ వ్యాప్తికి బ్రేక్ పడింది. అయితే లాక్ డౌన్ కాలాన్ని సమర్థవంతంగా వాడుకోవడంలో ప్రభుత్వాలు దారుణంగా విఫలం చెందాయనే విమర్శలూ లేకపోలేదు. ప్రధానంగా కరోనా కట్టడికి కీలక ఆయుధంగా భావించే టెస్టింగ్స్ విషయంలో మనం చాలా వెనుకబడిపోయాం. 130 కోట్ల జనాభాకుగానూ ఆదివారం నాటికి మొత్తం 6.25 లక్షల మందికి మాత్రమే టెస్టులు నిర్వహించారు. అమెరికాలో ప్రతి పది లక్షల మందిలో 15వేల మందికి, ఇటలీలో ఒక మిలియన్ జనాభాలో 28వేల మందికి కరోనా టెస్టులు చేస్తుండగా.. భారత్ లో ఆ సంఖ్య కేవలం 420గా ఉంది. ర్యాపిడ్ టెస్టుల వేగం పెంచాలని అన్ని వైపుల నుంచి ఒత్తిడి వస్తున్నా ప్రభుత్వం ఆశించిన మేరలో వాటిని నిర్వహించలేకపోతన్నది.
కిట్స్ ధరలపై కోర్టు క్యాప్
వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రోగుల్ని గుర్తించడానికి ఉద్దేశించిన ర్యాపిడ్ టెస్టింగ్ కట్లపై రగడ చెలరేగిన సంగతి తెలిసిందే కొన్ని రాష్ట్రాలు ఒక్కో కిట్ కు గరిష్టంగా రూ.1200 వెచ్చించాయని, మరికొన్ని రాష్ట్రాలు అత్యల్పంగా రూ.300కే ఒక్కో కిట్ కొనుగోలు చేసినట్లు రిపోర్టుల ఉన్నాయి. కాగా, కరోనా టెస్టింగ్ కిట్ల ధరల విషయంలో అతికి పోరాదని, వాటిని పేదలకు అందుబాటులో ఉంచాని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. చైనా నుంచి తెప్పించే ఒక్కో కిట్ ధర రూ.400 మించరాదని క్యాప్ విధించింది.
చాపకింద నీరులా..
భారత్ లో నమోదవుతోన్న కొవిడ్-19 కేసుల్లో 80 శాతం అసింప్టమాటిక్ కేసులు ఉండటం ఆందోళనరంగా మారింది. వైరస్ సోకిన తర్వాత కూడా రోగ లక్షణాలు బయటికి కనిపించకపోతుండటంతో వ్యాప్తి వేగంగా సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. చాపకింద నీరులా విస్తరిస్తోన్న ఈ తరహా కేసుల వ్యవహారం రాబోయే రోజుల్లో ప్రమాదకరంగా మారే అవకాశమున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించాలా వద్దా అనేది ప్రభుత్వానికి సవాలుగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ముఖ్యమంత్రులతో నిర్వహించనున్న వీడియో కాన్పరెన్స్ లో దీనిపై కొంత స్పష్టత వచ్చే అవకాశముంది. ఇకపోతే..
2లక్షల మందిని బలితీసుకున్నా..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సోకినవాళ్ల సంఖ్య 30 లక్షలకు పెరిగింది. అందులో వ్యాధి నుంచి కోలుకున్నవాళ్ల సంఖ్య 8.42లక్షలుకాగా, 2లక్షల పైచిలుకుమంది ప్రాణాలు కోల్పోయారు. అగ్రదేశం అమెరికాలో కేసుల సంఖ్య మిలియన్(10 లక్షలు)కు, మరణాల సంఖ్య 55వేలకు చేరువైంది. ఆ తర్వాతి స్థానాల్లో ఇటలీ(26,384), స్పెయిన్(22,902), ఫ్రాన్స్(22,614), యూకే(20,319) ఉన్నాయి. కేసుల సంఖ్య రీత్యా భారత్ 15వ స్థానంలో ఉంది.
Recommended Video