లోయలో పడ్డ అయ్యప్ప స్వాముల కారు
Sabarimala: కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. రోజూ వేలాదిమంది దర్శించుకుంటోన్నారు. ఈ నెల 26వ తేదీన మండలం పూజలు ముగియనున్నాయి. మకరవిళక్కు కోసం మళ్లీ 30వ తేదీన స్వామివారి ఆలయాన్ని తెరుస్తారు.
కిందటి నెల 16వ తేదీన మండలం పూజల కోసం అయ్యప్ప స్వామివారి ఆలయం తెరచుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 24 లక్షలమంది వరకు భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. 26వ తేదీ నాటికి ఈ సంఖ్య మరింత భారీగా పెరుగుతుందని అంచనా వేస్తోన్నారు.

భక్తులు వేల సంఖ్యలో తరలి వెళ్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటోన్నాయి. ఇటీవలే పత్తినంథిట్ట జిల్లాలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో కొత్తగా పెళ్లయిన దంపతులు ఉండటం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపినట్టయింది. మృతులను మథయ్ ఎప్పన్, అను, నిఖిల్, బిజూ జార్జ్గా గుర్తించారు.
రెండు రోజుల కిందటే తాజాగా మరో దుర్ఘటన సంభవించింది. తమిళనాడుకు చెందిన అయ్యప్ప స్వామి భక్తుడొకరు దుర్మరణం పాలయ్యారు. తిరువళ్లూరు జిల్లాలోని పూన్నపాక్కం గ్రామానికి చెందిన గోపీనాథ్ అనే భక్తుడు సన్నిధానానికి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుని నీలక్కల్కు చేరుకున్నాడు. అక్కడ వద్ద పార్కింగ్ స్థలంలో నిద్రపోగా ఓ బస్సు ఆయనపై నుంచి దూసుకెళ్లింది.
తాజాగా మరో ప్రమాదం సంభవించింది. అయ్యప్ప స్వాములు ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో అయిదుమందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు.
చంగనస్సేరికి చెందిన బాబు అనే భక్తుడు తన తొమ్మిది సంవత్సరాల కుమార్తె ఆరుషి, మరో ఇద్దరు శశి, అర్జున్తో కలిసి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం సాయంత్రం సన్నిధానం నుంచి పంపకు చేరుకున్న తరువాత కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణం అయ్యాడు.
మార్గమధ్యలో వారు ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైంది. పంపా- చాళక్కాయం రోడ్డుపై గల పొన్నంపారా సమీపానికి వచ్చిన తరువాత అదుపు తప్పింది. రోడ్డుపక్కనే ఉన్న చిన్నపాటి లోయలోకి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో బాబు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఆరుషి, శశి, అర్జున్ గాయపడ్డారు. వారితో ప్రయాణిస్తోన్న మరో ప్రయాణికుడు, డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే నీలక్కల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపక్కకు దూసుకెళ్లిన కారును క్రేన్ సహాయంతో వెలికితీశారు. బాబు మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ కోసం నీలక్కల్ ఆసుపత్రికి పంపించారు. గాయపడిన వాళ్లను చికిత్స కోసం కొట్టాయం ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications