జైలుపై పోలీస్ దుస్తుల్లో 10మంది దాడి, తప్పించుకున్న ఖలిస్తాన్ చీఫ్
పంజాబ్లోని నాభా జైలు పైన పదిమంది సాయుధులు దాడి చేసి, 100 రౌండ్లు కాల్పులు జరిపి, ఖలిస్తాన్ లిబరేషన్ చీఫ్ హర్మీందర్ సింగ్, మరో నలుగురు మిలిటెంట్లను తప్పించారు.
చండీగఢ్: పంజాబ్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న నాభా జైలు పైన పది మంది సాయుధులు దాడి చేశారు. పోలీసులు యూనిఫాంలు ధరించి వచ్చిన సాయుధులు 100 రౌండ్లు కాల్పులు జరిపారు. జైలులో ఉన్న ఖలిస్తాన్ లిబరేషన్ చీఫ్ హర్మీందర్ సింగ్ మింటూ, మరో నలుగురు తప్పించుకొని పారిపోయారు.
పంజాబ్లోని పటియాలా సమీపంలోని ఉన్న నభా కారాగారంలో ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. సాయుధులు పోలీసు దుస్తుల్లో రావడం గమనార్హం. ఖలిస్తాన్ చీఫ్ హర్మిందర్సింగ్ మింటూతో పాటు పరారైన నలుగురిలో.. గురుప్రీత్ సింగ్, వికీ గోండ్రా, నితిన్ డియోల్, విక్రమ్జిత్ సింగ్ ఉన్నారు.
పోలీసులు వారి కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలిస్తున్నారు. హర్మీందర్ సింగ్ మింటూ 2014 నవంబర్ నెలలో ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టయ్యారు. అతను థాయ్ లాండ్ నుంచి తిరిగి వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు.
2008లో సిర్సా బేస్డ్ డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్, 2010లో హల్వారా విమానాశ్రయంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న తదితర కేసుల్లో హర్మీందర్ సింగ్ మింటూ వాంటెడ్గా ఉన్నాడు. ఆయన పైన మొత్తం పది ఉగ్రవాద కేసులు విచారణలో ఉన్నాయి.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన పైన పంజాబ్ పోలీసులు మాట్లాడుతూ.. ఇది ప్లాన్గా చేశారని చెప్పారు. ఖలిస్తాన్ చీఫ్ను తీసుకు పోవడాన్ని చూస్తుంటే భద్రతలో పెద్ద లోపం కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.