కిరాతకం: మృగం కన్నా దారుణంగా.. పదేళ్ల బాలికపై...
మధ్యప్రదేశ్ లోని దేవాస్ జిల్లా సుంద్రెల్ గ్రామానికి చెందిన ఓ బాలిక శుక్రవారం సాయంత్రం తన తండ్రి కోసమని పొలానికి భోజనం తీసుకెళ్లింది. అంతే.. ఆ తరువాత ఆమె జాడ తెలియలేదు.
భోపాల్: మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఇటీవల ఓ కళాశాల విద్యార్థినిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం జరిపిన ఘటనను మరిచిపోకముందే అదే రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది.
అభం శుభం తెలియని పదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యంత పాశవికంగా అత్యాచారం జరిపి, ఆపైన హతమార్చాడు. ఆ వ్యక్తి మృగంలా మారి.. బాలిక కాళ్లు కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కి.. తన పశువాంఛ తీర్చుకుని.. ఆ తర్వాత ఆమెను చంపేసి పొలాల్లో పడేసి వెళ్లిపోయాడు.
మధ్యప్రదేశ్ లోని దేవాస్ జిల్లా సుంద్రెల్ గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ బాలిక శుక్రవారం సాయంత్రం తన తండ్రి కోసమని పొలానికి భోజనం తీసుకెళ్లింది. అంతే.. ఆ తరువాత ఆమె జాడ తెలియలేదు.
ఆదివారం ఉదయం వారి పొలానికి అర కిలోమీటరు దూరంలోనే అత్యంత దారుణస్థితిలో ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. ఆమెకు బాగా తెలిసిన వ్యక్తే ఈ అఘాయిత్యానికి పాల్పడి.. విషయం బయటకు రాకుండా హతమార్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బాలిక మృతదేహంపై అనేకచోట్ల పళ్లతో కొరికిన గాట్లున్నట్లు వారు తెలిపారు.
శవ పరీక్ష నిర్వహించిన వైద్యులు, ఫోరెన్సిక్ నిపుణుల నివేదిక ప్రకారం - బాలికపై అత్యాచారం జరిపి, ఊపిరాడకుండా చేసి చంపినట్లు తేలింది. ఈ మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.