కేరళ వరదలు: 'కేంద్రం సాయం కంటే విరాళాలే ఎక్కువ'
తిరువనంతపురం: కేరళ వరదల నేపథ్యంలో కేంద్రం సాయం అంతంత మాత్రమేనని రాష్ట్ర మంత్రి థామస్ ఐజాక్ అన్నారు. కేంద్రం సాయం కంటే విరాళాల ద్వారా వచ్చిన సాయమే ఎక్కువగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో వరదల కారణంగా 37 మంది ప్రాణాలు కోల్పోయారని, దాదాపు రూ.8,316కోట్ల మేర నష్టం వాటిల్లింది.
దీని నుంచి బయట పడేందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం కేంద్రం నుంచి తక్షణ సాయం కింద రూ.1,220కోట్లను అడిగింది. కానీ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసి, బాధితులను పరామర్శించి తక్షణ సాయం కింద వంద కోట్ల రూపాయలు మంజూరు చేశారు. దీనిపై రాష్ట్ర మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
వరదల వల్ల ఎనిమిది వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, ఆ నష్టాన్ని వెంటనే భర్తీ చేసేందుకు కనీసం రూ.3వేల కోట్లు అయినా అవసరమవుతాయని, కానీ కేంద్రం వంద కోట్లు మాత్రమే ప్రకటించిందని వాపోయారు.
కాగా, రాష్ట్ర మంత్రి థామస్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కేజే ఆల్ఫోన్స్ స్పందించారు. తాను, రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజుజు కేరళలో పర్యటించామని, కానీ థామస్ ఇప్పటి వరకు తన నియోజకవర్గమైన అలెప్పీలో పర్యటించలేదని, మరి ఆయన ఎందుకు మాట్లాడుతున్నారని, తాను కేరళ కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వమని కోరానని చెప్పారు.