మమతా బెనర్జీకి బిగ్ షాక్.. రూ.100 కోట్ల పరువు నష్టం దావా !
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి ఏకంగా రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. తనను బొగ్గు కుంభకోణంతో ముడిపెడుతూ సీఎం చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని కామెంట్ చేశారు. ఆమె మాటలు తన ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ మేరకు కోల్కతాలోని అలీపూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మమతా ఏమన్నారంటే..
జనవరి 8, 9 తేదీలలో మమతా బెనర్జీ బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన నిధులు సువేందు అధికారి ద్వారా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు చేరుతున్నాయని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని మమత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన సువేందు.. తన న్యాయవాది ద్వారా వెంటనే మమతకు నోటీసులు పంపారు. దీంతో 72 గంటల్లోగా ఆ ఆరోపణలను నిరూపించాలని లేదంటే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అయితే ఈ నోటీసులకు నిర్ణీత సమయంలోగా మమతా బెనర్జీ నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో సువేందు అధికారి న్యాయ పోరాటానికి దిగారు. తాను మాట మీద నిలబడతానని.. సీఎం చేసిన కట్టుకథలు, నిరాధారమైన ఆరోపణల్లో కోర్టుకు ఈడ్చుతానని చెప్పనన్నారు. అదే చేశానంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా మమతపై విరుచుకు పడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆధారాలు లేకుండా మాట్లాడటం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
అంతే కాకుండా ఈ కేసులో ఒకవేళ కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చి, పరిహారం చెల్లించాలని ఆదేశిస్తే.. ఆ రూ.100 కోట్ల సొమ్మును తాను సొంతానికి వాడుకోనన్నారు. ఆ డబ్బు మొత్తాన్ని పూర్తిగా సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. టీఎంసీ ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని ఫైర్ అయ్యారు.
గతంలో మమతా బెనర్జీ మంత్రి వర్గంలో కీలక నేతగా ఉన్న సువేందు అధికారి.. 2021 అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. నాటి నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం సాగుతోంది. కాగా నందిగ్రామ్ ఎన్నికల్లో సువేందు చేతిలో మమతా ఓటమి పాలయ్యారు.












Click it and Unblock the Notifications