ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోనే వెయ్యి మంది విద్యార్థులు: రష్యా నుంచి స్వదేశానికి భారత్ ఏర్పాట్లు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై దాడులు కొనసాగిస్తోంది. కీవ్ తోపాటు పలు నగరాలు ధ్వంసమవుతున్నాయి. కాగా, ఉక్రెయిన్ దేశంలోని తూర్పు ప్రాంతంలో వెయ్యి మంది భారతీయులు చిక్కుకుపోయారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఖర్కివ్ లో 300 మంది, సుమీలో 700 మంది భారతీయులు ఉండిపోయారని తెలిపింది. వారిని ఎలాగైనా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని విదేశాంగ శాఖ వెల్లడించింది.
Recommended Video
ఈ అంశంపై ఉక్రెయిన్, రష్యా దేశాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఉక్రెయిన్ నుంచి భారతదేశానికి విద్యార్థులను తరలించేందుకు చేపట్టిన ఆపరేషన్ గంగా కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 48 ప్రత్యేక విమానాల్లో 10,300 మందిని స్వదేశానికి తీసుకొచ్చినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.
ఫిబ్రవరిలో అడ్వైజరీ జారీ చేసిన తర్వాత దాదాపు 20వేల మంది ఉక్రెయిన్ సరిహద్దులను దాటారు. వారిలో ఇప్పటికే 10వేలకుపైగా భారతీయులు స్వదేశానికి తీసుకువచ్చామని పేర్కొంది. 24 గంటల్లో మరో 16 విమానాలు భారత్ కు రానున్నాయి. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఎప్పకప్పుడు పర్యవేక్షిస్తున్నామని, అక్కడ్నుంచి తరలించేందుకు అన్ని మార్గాలపై దృష్టి సారించామని వెల్లడించింది.
తమ పౌరులను తీసుకెళ్లేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని ఇరు దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొంది. ఆ ప్రాంతంలో కాల్పుల విరమణ పాటిస్తే కాస్త ఊరట లభిస్తుందని తెలిపింది. భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని తెలిపింది. కాగా, ఉక్రెయిన్ నుంచి శుక్రవారంనాడు 14 విమానాలు, మూడు ఐఏఎఫ్ విమానాల్లో 3772 మంది భారత్ చేరుకున్నట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది.
#OperationGanga | A special Indigo flight, carrying 229 Indian nationals from #Ukraine, arrives in Delhi from Suceava in Romania pic.twitter.com/mucdrnJk1R
— ANI (@ANI) March 5, 2022
శనివారం మరో 11 పౌర విమానాలు, నాలుగు వాయుసేన విమానాల్లో 2200 మంది స్వదేశానికి చేరుకున్నట్లు తెలిపింది. రష్యా సరిహద్దుకు సమీపంలో ఉన్న నగరాల్లోని భారతీయులను రష్యాకు తరలించి అక్కడ్నుంచి భారత్కు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకు రష్యా కూడా సహకరించేందుకు అంగీకరించింది. ఉక్రెయిన్ నగరాల్లో చిక్కుకున్న భారతీయులను తమ బస్సులలో రష్యాకు తరలిస్తామని పేర్కొంది. కాగా, శనివారం తెల్లవారుజామున 200 మందికిపైగా భారతీయ విద్యార్థులు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి చేరుకున్నారు.