రామ మందిరానికి రూ.3400 కోట్ల విరాళం - ఎంత మంది ఇచ్చారంటే..!!
అయోధ్య రామ మందిర నిర్మాణం శర వేగంగా సాగుతోంది. శతాబ్దాల వివాదంగా ఉన్న ఈ వ్యవహారంలో అయోధ్యలో రామాలయం నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో..కోర్టు తీర్పుకు అనుగుణంగా అక్కడ రామాలయం నిర్మాణం కోసం భూమి పూజ చేసారు. 2020 ఆగస్టు 5న అయోధ్య రామ మందిర నిర్మాణం లాంఛనంగా ప్రారంభించారు. ప్రధాని మోదీ దేశం మొత్తం తిలకిస్తుండగా..ఆలయానికి పునాది రాయి వేశారు. అప్పటి నుంచి నిర్మాణ పనులు చకచకా జరిగిపోతున్నాయి.
ఇక, రామాలయం నిర్మాణానికి సంబంధించి.. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటోంది. 2024 జనవరి నాటికి ఆలయ గర్భగుడి సిద్ధమవుతుందని ట్రస్టు చెబుతోంది. 2.7 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మందిరం పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు ఉండనుంది. మూడు అంతస్తులతో నిర్మించనున్న ఈ మందిరం ఎత్తు 161 అడుగులు ఉంటుంది. రెండున్నర అడుగుల పొడవు ఉన్న 17 వేల రాళ్లను మందిరం నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. ఇక, రామాలయం నిర్మాణంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తల మొదలు.. సామాన్యుల వరకు భాగస్వాములు అవుతున్నారు.
రామ మందిర నిర్మాణం కోసం ఇప్పటివరకు రూ.3,400 కోట్లు విరాళంగా వచ్చినట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. అయితే, అనూహ్యంగా ఇప్పటి వరకు 11 కోట్ల మంది దాతలు నుంచి ఈ విరాళాలు ఇచ్చినట్లు వివరించింది. పది రూపాయా మొదలు కోటి రూపాయాల వరకు విరాళం ఇచ్చిన వారు ఉన్నారని ట్రస్టు స్పష్టం చేసింది. ఇక, కొందరు తమ పేర్లు బయటకు చెప్పటానికి ఇష్టం లేక డోనేషన్లు ఇచ్చినా.. బయటకు వెల్లడించటం లేదు. 2024 జనవరికి గర్భగుడి పూర్తి చేయటంతో పాటుగా 2025 డిసెంబర్ కు దాదాపుగా ప్రధాన నిర్మాణాలు పూర్తి చేసే విధంగా ఆలయ ప్రాంగణంలో పనులు కొనసాగుతున్నాయి.