బంగారం కోసం వెళ్లి.. 11మంది అక్కడిక్కడే చనిపోయారు
జకార్తా : ప్రపంచ మార్కెట్ లో బంగారానికి మంచి డిమాండ్ ఉండడంతో.. ఇండోనేషియాలో అక్రమ బంగారు గనుల తవ్వకం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇదే క్రమంలో మూతపడ్డ ఓ బంగారు గనిలో బంగారం అన్వేషణ కోసం వెళ్లిన 11 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఇండోనేషియాలోని సుమత్రా దీవిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
భారీ వర్షానికి మట్టిపెళ్లలు విరిగిపడడంతో.. వారంతా సజీవ సమాధి అయి ఉంటారని భావిస్తున్నారు. సుమత్రా దీవిలో సుమారు 50మీటర్ల లోతులో అక్రమ తవ్వకాలు జరుపుతుండగా.. ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో 21నుంచి 55ఏళ్ల మధ్య వయసున్న మొత్తం 11మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయి ఉంటారని సమాచారం.
ప్రస్తుతం మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. గతేడాది అక్టోబర్ లో జావా దీవిలోను ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడం గమనార్హం. అప్పట్లో నిరుపయోగంగా ఉన్న బంగారు గనిలోకి వెళ్లిన 12మంది అందులోనే చనిపోయారు.