11 గంటల కర్ఫ్యూ.. ఎమర్జెన్సీకి మాత్రం మినహాయింపు.. పాటియాలాలో హైటెన్షన్
పంజాబ్లో గల పాటియాలాలో హై టెన్షన్ నెలకొంది. రెండు గ్రూపుల మధ్య గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు 11 గంటల కర్ఫ్యూ విదించారు. ఆలయం వెలుపల యాంటి ఖలిస్తాన్ ర్యాలీ తీసే ప్రయత్నం చేశారు. దీంతో శివ్ సేన (బాల్ థాకరే) సిక్కు గ్రూపు మధ్య గొడవ జరిగింది. రాళ్లు రువ్వుకోవడంతో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు.
పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. దీంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉంది. ఎందుకయినా మంచిదని 11 గంటల కర్ఫ్యూ విధించారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉండనుంది. శాంతి భద్రతల కోసమే కర్ఫ్యూ అని పోలీసులు స్పష్టంచేశారు. అయితే ఎమర్జెన్సీ సేవలు, అత్యవసర సేవలకు ఇందుకు మినహాయింపు ఉంటుంది.
పరిస్థితిని సీఎం భగవంత్ మాన్ సమీక్షిస్తున్నారు. ఇదీ దురదృష్టకర ఘటన అని చెబుతున్నారు. పోలీసు బాస్తో పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. తిరిగి శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. తమకు పంజాబ్లో శాంతి, సామరస్యం అధిక ప్రాధాన్యం అని తెలిపారు.