రాజ్యసభలో 12 మంది సభ్యుల సస్పెన్షన్ - గత సమావేశాల్లో అనుచిత ప్రవర్తన : ఈ సెషన్స్ మొత్తం..!!
రాజ్యసభ నుంచి 12 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసారు. వర్షాకాల సమావేశాలలో అనుచిత ప్రవర్తన కారణంగా 12 మంది ఎంపీల పైన చర్యలు తీసుకుంటున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. ఈ రోజు సభలో రైతు చట్టాల ఉప సంహరణ బిల్లు పైన రాజ్యసభలో విపక్షాలు చర్చకు డిమాండ్ చేసాయి. ప్రభుత్వం రైతు చట్టాల ఉపసంహరణ బిల్లును రెండు సభల్లోనూ ఆమోదింపచేసుకుంది. దీంతో..విపక్ష సభ్యులు పోడియం వద్దకు దూసుకొచ్చారు. నినాదాలతో హోరెత్తించారు. ఛైర్మన్ ఎంత సేపు వారించే ప్రయత్నం చేసినా సభ్యులు వినలేదు. సభలో గందరగోళ పరిస్తితులు తలెత్తాయి.
దీంతో సభను మంగళవారానికి వాయిదా వేసారు. అయితే, వర్షాకాల సమావేశాల్లో సభలో అనుచితంగా ప్రవర్తించిన పలు పార్టీలకు చెందిన 12 మంది సభ్యుల పైన ఛైర్మన్ సస్పెన్షన్ వేటు వేసారు. ఈ సమావేశాలు మొత్తం వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో ఎలమరం కరీం (సీపీఎం), ఫులోదేవీ నేతం ( కాంగ్రెస్), ఛాయా వర్మ (కాంగ్రెస్), రిపున్ బోరా (కాంగ్రెస్), బినోయ్ విశ్వం (సీపీఐ), రాజమణి పటేల్ ( కాంగ్రెస్), డోలా సేన్ (టీఎంసీ), శాంతా ఛట్రీ (టీఎంసీ),సయ్యద్ నసీర్ హుస్సేన్ (కాంగ్రెస్), ప్రియాంక చతుర్వేది (శివసేన), అనిల్ దేశాయ్ ( శివసేన), అఖిలేష్ ప్రసాద్ సింగ్ ( కాంగ్రెస్) ఉన్నారు.

Recommended Video
వీరు గత సమావేశాల చివరి రోజ అయిన ఆగస్టు 11న సభ గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించారనే కారణంతో సస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ ప్రకటించింది. రాజ్యసభ బిజినెస్ రూల్ 256 కింద వీరి పైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. భద్రతా సిబ్బంది పైన ఉద్దేశ పూర్వకంగా దాడులు చేసినందుకు వారి పైన చర్యలు తప్పవని స్పష్టం చేసారు. ఇక, మరో వైపు రెండు సభల్లో రైతు చట్టాల ఉప సంహరణ బిల్లు ఆమోదం పొందింది. ఈ ఉదయం కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో సహా రాహుల్, పార్టీ ఎంపీలతో కలిసి రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేసారు. రెండు సభల్లోనూ గందరగోళ పరిస్థితులు తలెత్తటంతో ఎటువంటి చర్చ లేకుండానే రెండు సభలు రేపటికి వాయిదా పడ్డాయి.












Click it and Unblock the Notifications