నక్సల్స్ పేలుళ్లు: 12 మంది పోలీసులకు గాయాలు
రాంఛీ: మావోయిస్టులు జరిపిన ఐఈడి పేలుళ్లలో 12 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిదిహ్ జిల్లాలో చోటు చేసుకుంది. నలుగురు వ్యక్తులను మావోయిస్టులు అపహరించడంతో వారి గాలింపులో భాగంగా కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు పేలుళ్లకు పాల్పడ్డారు.
భద్రతాదళాల ప్రధాన కార్యాలయం నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఆధునాతన పేలుడు పరికారాల (ఐఈడి)లను ఉపయోగించి మావోయిస్టులు ఈ పేలుళ్లకు పాల్పడినట్లు తెలిసింది. గిరిదిహ్ జిల్లాలోని దోల్కాట ప్రాంతంలో సంచరిస్తున్న పోలీసుల బలగాలపై ఒక్కసారిగా పేలుళ్లు జరపడంతో 12 మంది గాయపడ్డారు.
రాష్ట్రానికి చెందిన నలుగురు పోలీసులు, ఎనిమిది మంది పారా మిలిటరీ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) బలగాలకు గాయాలైనట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అదనపు బలగాలను ఘటనా స్థలానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
నవ్కానియా వద్ద కారులో వెళుతున్న నలుగురు వ్యక్తులను శనివారం సాయంత్రం మావోయిస్టులు అపహరించారు. దీంతో జార్ఖండ్ రాష్ట్ర డిజిపి రాజీవ్ కుమార్ గాలింపు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అపహరణకు గురైన వారి గాలింపులో భాగంగా భారీ పోలీసు బలగాలు ఈ ప్రాంతానికి చేరుకున్నాయి.