అసలే మద్య నిషేదం: లిక్కర్ కు 13 మంది బలి
పాట్నా: అక్రమ మద్యం సేవించి 13 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటన బీహార్ లో జరిగింది. అసలే మద్య నిషేదం ఉన్న రాష్ట్రంలో ఒకే జిల్లాలో మంగళవారం రాత్రి మద్యం సేవించిన వారిలో 13 మంది బలైనారు.
బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లాలోని గోరఖ్ పూర్ సమీపంలో మంగళవారం సాయంత్రం అక్రమంగా సరఫరా చేసిన చీఫ్ లిక్కర్ ను పలువురు కొనుగోలు చేసి ఇష్టం వచ్చినట్లు పీకలదాకా సేవించారు.
మద్యం సేవించిన కొంత సేపటికే వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గోరఖ్ పూర్ లోని ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స విఫలమై అక్కడే ఐదు మంది మరణించారు. బుధవారం ఉదయం వరకు అక్రమ మద్యం సేవించి మరణించిన వారి సంఖ్య 13కు చేరింది. పలువురి పరిస్థితి విషమంగా ఉందని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపించారు.
మద్యం సేవించడం వలనే ప్రాణాలుపోయాయని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే పరువు పోతుందనే భయంతో పోలీసులు వేరే కథలు చెబుతున్నారు. వీరు ఎలా చనిపోయారు అని దర్యాప్తు చెయ్యడానికి ముగ్గురు అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామని నితీష్ కుమార్ ప్రభుత్వం తెలిపింది.