ఆలయంలో తొక్కిసలాట: 108మంది మృతి! నదిలో పడ్డారు
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం విషాదకర సంఘటన జరిగింది. దాతియా వద్ద గల రతన్ గఢ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 108 మంది భక్తులు మృతి చెందారు. తొక్కిసలాట వల్ల నదిలో పడిపోయిన భక్తుల కోసం సహాయ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది.
ఈ ఘటనలో దాదాపు 108 మంది భక్తులు మృతి చెందగా వందలమంది వరకు గాయపడ్డారు. దసరా పర్వదినం కావడంతో దుర్గా పూజ నిమిత్తం పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు. దాదాపు ఐదు లక్షల మందికి పైగా భక్తులు తరలి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు.
భక్తులు వెల్లువెత్తడంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. దీంతో తొక్కిసలాట జరిగింది. పలువురు పక్కనే ఉన్న నదిలో పడిపోయారు. నదిలో పడిపోయి వారి కోసం భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు.
తొక్కిసలాట జరిగిన సమయంలో దాదాపు వంద మంది వరకు సింద్ నది పైన ఉన్న బ్రిడ్జి పైన ఉన్నట్లుగా తెలుస్తోంది. తొక్కిసలాట జరుగుతుండగా కొందరు ప్రాణాలు రక్షించుకోవడం కోసం కొందరు సింద్ నదిలోకి దూకినట్లుగా తెలుస్తోంది.