అమానుషం: జబ్బు నయం చేయమని వెళ్తే.. బర్రె పేడ తినిపించాడు!
భూత వైద్యుడి ఆదేశాలతో బాలిక తల్లిదండ్రులు ఆమెకు బలవంతంగా బర్రె పేడ తినిపించారు. గత వారం చోటు చేసుకున్న ఈ అమానుష ఘటన.. స్థానిక మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.
లాతూర్: శాస్త్ర సాంకేతిక రంగాలు ఇంతగా పురోగమిస్తున్నా.. గ్రామీణ మూలాలను మాత్రం అవి తాకలేకపోతున్నాయి. నగరాలకే పరిమితమవుతున్న అభివృద్ది గ్రామీణ జనజీవనానికి చేర్చడంలో వ్యవస్థలు విఫలమవుతూనే ఉన్నాయి. ఫలితంగా ఇంకా మూఢనమ్మకాల ఉచ్చు నుంచి వారు బయటలపడలేకపోతున్నారు.
తాజాగా మహారాష్ట్రలోని లాతూర్లో ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది. లాతూర్కు చెందిన 17ఏళ్ల బాలిక ఇటీవల కొంత జబ్బు పడింది. వైద్యులను సంప్రదించాల్సిన ఆమె తల్లిదండ్రులు ఓ మంత్రగాన్ని ఆశ్రయించారు. దీంతో బాలికకు దెయ్యం పట్టిందని నిర్దారించిన ఆ భూత వైద్యుడు.. చికిత్సలో భాగంగా ఆమెను బర్రె పేడ తినమన్నాడు.
భూత వైద్యుడి ఆదేశాలతో బాలిక తల్లిదండ్రులు ఆమెకు బలవంతంగా బర్రె పేడ తినిపించారు. గత వారం చోటు చేసుకున్న ఈ అమానుష ఘటన.. స్థానిక మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన పోలీసులు.. భూత వైద్యుడిపై కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.