18-44 ఏళ్ల వయస్కులకు వ్యాక్సిన్ ఎంపిక చేసుకునే అవకాశం, కానీ: కోవిన్ చీఫ్ ఆర్ఎస్ శర్మ
న్యూఢిల్లీ: మే 1 నుంచి వ్యాక్సిన్ వేయించుకునే 18-44 ఏళ్ల వయస్కులు ప్రైవేటు కేంద్రాల్లో తాము ఏ వ్యాక్సిన్ వేసుకోవాలో ఎంపిక చేసుకునే అవకాశం ఉందని కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ఎంపవర్మెంట్ కమిటీ ఛైర్పర్సన్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను ఉపయోగించుకునే అవకాశం ఉంటుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ డ్రైవ్ కింద ఏప్రిల్ 30 వరకు హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు 45ఏళ్లు పైబడినవారు వ్యాక్సిన్ తీసుకుంటారని తెలిపారు. వీరు మాత్రం భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ లేదా ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్లలో ఎంపిక చేసుకునే అవకాశం లేని విషయం తెలిసిందే.
అయితే, వ్యాక్సిన్ ఎంపిక చేసుకునే అవకాశం కేవలం ప్రైవేట్ సెంటర్లలో మాత్రమే ఉంటుందని, అందుకు ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని శర్మ స్పష్టం చేశారు. ప్రభుత్వ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు వేయడం జరుగుతుందని, తొలి డోసు ఏదైతే తీసుకుంటారో.. రెండో డోసు కూడా అదే వేయడం జరుగుతుందని వెల్లడించారు.
కోవిన్ పోర్టల్లో వ్యాక్సిన్లకు సంబంధించిన వివరాలు, ధరలు ఉంటాయని, లబ్ధిదారులు వాటిని చూసి నిర్ణయం తీసుకోవచ్చన్నారు. మే 1 నుంచి వ్యాక్సిన్ తయారీ సంస్థలు 50 శాతం వ్యాక్సిన్లను రాష్ట్రాలకు, ప్రైవేటుదారులకు అమ్ముకోవచ్చని, మిగితా మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ప్రక్రియ(హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్ల)కు కేటాయిస్తారని తెలిపారు.
ప్రభుత్వ కేంద్రాల్లో వ్యాక్సిన్లు ఉచితంగానే వేస్తారని, ప్రైవేటు సెంటర్లలో రూ. 250 డోసు ధర ఉంటుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు 18-44 వయస్కులందరికీ ఉచితంగానే కరోనా వ్యాక్సిన్ అందించనున్నట్లు ప్రకటించాయి. ప్రైవేటు సెంటర్లలో వేసుకునేవారు మాత్రం వ్యాక్సిన్ ధరలను చెల్లించాల్సి ఉంటుంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల ధరలను సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ఇటీవల తగ్గించిన విషయం తెలిసిందే. ప్రైవేటు ఆస్పత్రులకు రూ. 600, రాష్ట్రాలకు రూ. 300లకు వ్యాక్సిన్ డోసులను అందజేయనున్నట్లు తెలిపింది.