ఇదీ వలస కార్మికుల గోస.. సిమెంట్ మిక్సర్లో 18 మంది కిక్కిరిసి...
లాక్ డౌన్ మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ ఎక్కువ సమస్యలు అనుభవిస్తున్నది వలస కార్మికులే. కష్ట కాలంలో అయినవాళ్లకు దూరంగా.. తిండి తిప్పలు లేక అలమటించిపోయారు. బస్సులు,రైళ్లు బంద్ చేస్తే.. కాలి నడకతోనే వందల కి.మీ ప్రయాణం సాగించారు. లాక్ డౌన్ 3.0లో వలస కార్మికుల తరలింపుకు ప్రభుత్వం అనుమతినిచ్చినప్పటికీ.. పూర్తి స్థాయిలో ఆ చర్యలు కనిపించడం లేదు. దీంతో ఇప్పటికీ స్వస్థలాలకు వెళ్లేందుకు కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లో వెలుగుచూసిన ఈ ఘటనే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
సిమెంట్ మిక్సర్ డ్రమ్లో 18 మంది..
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ సిమెంట్ కాంక్రీట్ మిక్సర్లో 18 మంది వలస కార్మికులను పోలీసులు గుర్తించారు. రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. డ్రైవర్ను పలు ప్రశ్నలు అడిగారు. డ్రైవర్ సమాధానాల్లో ఎక్కడో తేడా కొట్టింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు.. కాంక్రీట్ మిక్సర్ డ్రమ్ను ఓపెన్ చేశారు. ఆశ్చర్యంగా అందులో 18 మంది వలస కార్మికులు ఉన్నారు. దానికి ఒక చిన్న రంధ్రం కూడా వారందరినీ బయటకు తీసుకొచ్చారు. అంత తక్కువ స్పేస్లో 18 మంది కిక్కిరిసి కూర్చోవడం చూసి పోలీసులే షాక్ తిన్నారు.
అందరూ వలస కార్మికులే..
ఈ 18 మంది వలస కార్మికులేనని.. మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. లాక్ డౌన్ కారణంగా మార్చి నెల నుంచి వీరికి ఉపాధి లేకుండా పోయిందన్నారు. శుక్రవారం ఈ ట్రక్కు మహారాష్ట్ర నుంచి బయలుదేరిందని.. శనివారం(మే 2)న ఇండోర్కు 35కి.మీ దూరంలోని పంత్ పిప్లై గ్రామం వద్ద తనిఖీ చేశామని చెప్పారు. ప్రస్తుతానికి వారందరినీ ప్రభుత్వ షెల్టర్ జోన్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ఓ బస్సు ద్వారా వారిని ఉత్తరప్రదేశ్ తరలిస్తామన్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు
ట్రక్కును పోలీస్ స్టేషన్కు తరలించి డ్రైవర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలైన తర్వాత చాలామంది వలస కార్మికులు,కూలీలు నగరాల్లో చిక్కుకుపోయారు. కొంతమంది కాలి నడకనే స్వస్థలాల బాట పట్టగా.. కొందరు పాల వ్యాన్లలో దాక్కుని సైతం స్వస్థలాలకు వెళ్లే ప్రయత్నం చేశారు. తాజాగా ప్రభుత్వం ప్రత్యేక రైళ్లు,బస్సుల ద్వారా వీరిని తరలించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. మరిన్ని చర్యలు అవసరమన్న వాదన వినిపిస్తోంది. వలస కార్మికుల తరలింపులో భాగంగా మొదట ఐదు ప్రత్యేక రైళ్ల ద్వారా హైదరాబాద్ సహా పలు నగరాల నుంచి వలస కార్మికులను స్వస్థలాలకు తరలించారు.