నేడు సజ్జన్, రేపు కమల్నాథ్, ఆ తర్వాత గాంధీ ఫ్యామిలీ: సిక్కు అల్లర్ల తీర్పుపై హర్సిమ్రాత్
న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ పార్టీ నేత సజ్జన్ కుమార్ను దోషిగా తేల్చి, జీవిత ఖైదీ విధిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రమంత్రి హర్ సిమ్రాత్ కౌర్ బాదల్ స్పందించారు. ఎట్టకేలకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. తాను ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు చెబుతున్నానని పేర్కొన్నారు.
1984 సిక్కుల ఊచకోత కేసు: న్యాయం గెలిచింది.. ఈ కాంగ్రెస్ నేతకు జీవితకాల శిక్ష
2015లో తాము చేసిన విజ్ఞప్తి మేరకు ఈ కేసు దర్యాప్తుకు ప్రధాని సిట్ను ఏర్పాటు చేశారని చెప్పారు. అందుకు ధన్యవాదాలు అన్నారు. ఢిల్లీ హైకోర్టు తీర్పుతో న్యాయచక్రాలు ముందుకు కదిలాయన్నారు. ఈ రోజు సజ్జన్ కుమార్ దోషిగా తేలారని, రేపు జగదీష్ టైట్లర్, ఆ తర్వాత కమల్నాథ్ వంతు వస్తుందని చెప్పారు. ఇది చారిత్రాత్మక తీర్పు అన్నారు. చివరకు గాంధీ కుటుంబానికి కూడా సెగ తప్పదని ఆమె అన్నారు.
కాగా, 1984లో జరిగిన సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్కు ఢిల్లీ హైకోర్టు జీవితకాల శిక్ష విధించింది. సజ్జన్ కుమార్ ఈ కేసులో నిర్దోషి అని కిందికోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ ఆయనకు జీవితకాల శిక్ష విధిస్తూ హైకోర్టు సోమవారం తీర్పు చెప్పింది. నాడు సిక్కుల ఊచకోతకు సంబంధించి కింది కోర్టు కుట్రకోణంను విస్మరించిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించి కెప్టెన్ భగ్మాల్, గిర్ధారి లాల్, కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ బల్వాన్ కోఖర్లకు కూడా హైకోర్టు జీవితకాల శిక్ష విధించింది. కిషన్ కొక్కర్, మాజీ ఎమ్మెల్యే మహేందర్ యాదవ్లకు పదేళ్ల పాటు శిక్ష విధించింది.
అక్టోబర్ 31, 1984లో ఇందిరా గాంధీ హత్య అనంతరం ఢిల్లీ కంటోన్మెంట్లో చెలరేగిన అల్లర్లలో సిక్కులను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును జస్టిస్ ఎస్ మురళీధర్, వినోద్ గోయెల్ విచారణ చేసి తీర్పు వెల్లడించారు. 1984లో జరిగిన అల్లర్లను పరిశీలిస్తే మానవత్వంపై జరిగిన దాడిగా చూడాల్సి ఉందని జడ్జీలు అభిప్రాయపడ్డారు. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని బాధితులు గుర్తించాలని జడ్జిలు పేర్కొన్నారు.
ఈ కేసులో కింది కోర్టు సజ్జన్ కుమార్ను నిర్దోషిగా పేర్కొంటూ తీర్పు వెలువరించింది. కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సీబీఐ. ఈ కేసును విచారణ చేసిన ధర్మాసనం సజ్జన్ కుమార్తో పాటు మరికొందరిని దోషిగా పేర్కొంటూ తీర్పునిచ్చింది.