ముంబై పేలుళ్ల నిందితుడు కారాచిలో మృతి
న్యూఢిల్లీ: 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసు నిందితుడు అనారోగ్యంతో మరణించాడని భారత్ ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్ లోని కారాచిలో నిందితుడు యాకూబ్ ఖాన్ అలియాస్ యెద్ యాకూబ్ ఆసుపత్రిలో మరణించాడని అధికారులు తెలిపారు.
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితులలో యాకూబ్ ఖాన్ ఒకడు. 1993లో యాకూబ్ ఖాన్ అతని సోదరుడు మజీద్ లు టైగర్ మెమెన్ తో కలిసి ముంబైలో వరస బాంబు పేలుళ్లలో కీలకపాత్ర పోషించారని వెలుగు చూసింది.
ఆర్డీఎక్స్ లు ముంబై నగరం నుండి ఇతర ప్రాంతాలకు తరలించడంలో యాకూబ్ ఖాన్ సిద్దహస్తుడు. ముంబై బాంబు పేలుళ్ల తరువాత టైగర్ మెమెన్ తో కలిసి యాకూబ్ ఖాన్ దుబాయ్ మీదుగా పాకిస్థాన్ పారిపోయాడని అధికారులు తెలిపారు.
యాకూబ్ ఖాన్ ఇటివల అనారోగ్యానికి గురైనాడు. బుధవారం గుండె పోటు రావడంతో అతని కుటుంబ సభ్యులు కరాచిలోని ప్రయివేటు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. చికిత్స విఫలమై అతను మరణించాడని భారత్ నిఘా వర్గాలు వెల్లడించాయి.
అయితే పాక్ అధికారులు మాత్రం యాకూబ్ ఖాన్ గురించి మాకు తెలీదు అంటున్నారు. ఆ విషయంపై ముంబై నగర పోలీసు కమిషనర్ రాకేష్ మారియా స్పందించారు. యాకూబ్ ఖాన్ మరణించాడని మీడియాలో చూస్తున్నామని, అధికారికంగా మాకు తెలియలేదని ఆయన అంటున్నారు.