కాలేజ్ ఫెస్ట్కని వెళ్తే..డ్రింక్స్లో మత్తుమందు కలిపి ముగ్గురు ఐఐటీ అమ్మాయిలపై..
కాలేజ్ ఫెస్ట్ కదాని పోతే.. కూల్ డ్రింక్స్ లో మత్తుమందు కలిపి.. ముగ్గురు ఐఐటి విద్యార్థినులపై ఇద్దరు విద్యార్థులు అత్యాచారం జరిపిన ఉదంతమిది.
గౌహతి: కాలేజ్ ఫెస్ట్ కదాని పోతే.. కూల్ డ్రింక్స్ లో మత్తుమందు కలిపి.. ముగ్గురు ఐఐటి విద్యార్థినులపై ఇద్దరు విద్యార్థులు అత్యాచారం జరిపిన ఉదంతమిది. ఈ కేసులో అస్సాం పోలీసులు నిందితులిద్దరినీ బుధవారం అరెస్టు చేశారు.
ఈ అఘాయిత్యం వివరాలు ఇలా ఉన్నాయి. ఫిబ్రవరి 4న గౌహతి ఐఐటి ఆవరణలో వార్షిక సాంస్కృతికోత్సవం నిర్వహించారు. ఏటా ఈ ఉత్సవం జరుగుతుంది. ఐఐటి విద్యార్థులే కాక చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఈ ఏడాది కూడా 20 వేల మందికి పైగా విద్యార్థులు ఈ వార్షికోత్సవానికి హాజరయ్యారు.
ఇదే అదనుగా ఐఐటికే చెందిన కునాల్, అజయ్ అనే విద్యార్థులు కూల్ డ్రింక్స్ లో మత్తుమందు కలిపి.. పథకం ప్రకారం దానిని తాగించి ముగ్గురు విద్యార్థినులపై అత్యాచారానికి ఒడిగట్టారు.
ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధిత విద్యార్థినులను అర్థరాత్రి ప్రాంతంలో ఐఐటికి చెందిన సెక్యూరిటీ గార్డులే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం జరిగిన దారుణంపై విద్యార్థినులు అమీన్ గావ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో వారిపై అత్యాచారానికి ఒడిగట్టిన సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థి కునాల్ కుంభకర్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విద్యార్థి అజేయ్ డేలను బుధవారం పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. దీనిపై ఐఐటి అధికారులు మాట్లాడుతూ తమ ఐఐటికి చెందిన ఇద్దరు విద్యార్థులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నది నిజమేనని, అయితే ఏం జరిగిందో తమకు పూర్తిగా తెలియదని పేర్కొన్నారు.