కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రదాడి చోటు చేసుకున్న తరువాత భద్రత బలగాలు రంగంలోకి దిగాయి. పాకిస్తాన్తో సరిహద్దులను పంచుకుంటోన్న నియంత్రణ రేఖ వెంబడి గస్తీని ముమ్మరం చేశాయి. నిఘా పెంచాయి. అన్ని సెక్టార్లలో అదనపు పారా మిలటరీ బలగాలు, బీఎస్ఎఫ్ జవాన్లను మోహరింపజేశారు.
ఈ క్రమంలో బారాముల్లా సమీపంలోని యూరీ సెక్టార్ వద్ద భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. పాకిస్తాన్ వైపు నుంచి సరిహద్దులను దాటుకుని భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఇద్దరు చొరబాటుదారులను బీఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున మారణాయులను స్వాధీనం చేసుకున్నారు.

ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్, రెండు ఏకే 47 రైఫిళ్లను జవాన్లు సీజ్ చేశారు. వాటిపై ఉన్న మార్క్ల ఆధారంగా ఈ ఇద్దరు చొరబాటుదారులు కూడా పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండొచ్చని అనుమానిస్తోన్నారు. పహల్గామ్ నరమేధం అనంతరం జమ్మూ కాశ్మీర్కు మారణాయుధాలను చేరవేయడానికి ప్రయత్నించి ఉండొచ్చని భావిస్తోన్నారు.
ఈ ఎన్కౌంటర్తో మరో భారీ ఉగ్రవాద దాడి కుట్రను భద్రత బలగాలు పటాపంచలు చేసినట్టయింది. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఐఈడీ అత్యంత శక్తిమంతమైనది కావడం ప్రాధాన్యతు సంతరించుకుంది. అదే గనక ఉగ్రవాదుల చేతుల్లో పడివుంటే- మరింత మారణ హోమానికి ప్లాన్ చేసి ఉండేవాళ్లని చెబుతున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం నిరవధికంగా తనిఖీలు, సోదాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి జమ్మూ కాశ్మీర్లో. పహల్గామ్ బైస్రాన్ జనరల్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. జమ్మూ కాశ్మీర్లోని అన్ని పర్యాటక ప్రదేశాలు, ఇతర సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు.
దేశ రాజధాని సైతం అప్రమత్తం అయింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై సహా పలు నగరాల్లో రెడ్ అలర్ట్ జారీ అయింది. ఆర్టికల్ 370 రద్దయిన తరువాత చోటు చేసుకున్న అతిపెద్ద ఉగ్రవాద దాడి ఇదే. అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడి ఉదంతం.. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉలిక్కిపడేలా చేసింది. తీవ్ర ఆగ్రహావేశాలను రేకెత్తించింది.












Click it and Unblock the Notifications