తోపుడు బండి వ్యాపారికి ఇద్దరు బాడీగార్డులు... AK-47తో సెక్యూరిటీ
తోపుడు బండిపై దుస్తులు విక్రయించే ఒక వ్యక్తికి ఇద్దరు బాడీగార్డులు ఉన్నారు. ఆ బండిపై వ్యాపారి దుస్తులు అమ్ముతుండగా ఆ ఇద్దరు బాడీగార్డులు ఆయనకు AK-47 తుపాకులతో భద్రత కల్పిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఎటా జిల్లాకు చెందిన రామేశ్వర్ దయాల్ తోపుడు బండిపై దుస్తులు విక్రయించే వ్యాపారం చేస్తుంటారు. ఇటీవల ఆయన తన భూమికి పట్టా ఇప్పించాలంటూ సమాజ్ వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్ సింగ్ సోదరుడు జుగేంద్ర సింగ్ ను కలిశారు. ఈ విషయమై వీరిద్దరి మధ్య వివాదం తలెత్తింది. అనంతరం రామేశ్వర్ దయాల్ కులంపేరుతో తనను దూషించారంటూ జుగేంద్రసింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తనపై ఫిర్యాదు చేయడాన్ని సవాల్ చేస్తూ జుగేంద్ర హైకోర్టుకు వెళ్లారు. దయాల్ ను కోర్టుకు హాజరు కావల్సిందిగా న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. ఒక్కడే కోర్టుకు రావడం చూసి న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. అతను బాధితుడిగా ఉంటే ఎందుకు భద్రత కల్పించలేదని పోలీసులను న్యాయమూర్తి నిలదీశారు. వెంటనే భద్రత కల్పించాలంటూ ఆదేశించడంతో ఇద్దరు బాడీగార్డులను దయాల్ కు భద్రతగా నియమించారు.
నాలుగు చక్రాల బండిపై దయాల్ చిన్నపిల్లలు, మహిళలకు సంబంధించిన దుస్తుల అమ్మకాలు చేస్తుంటారు. ఇద్దరు యువ పోలీసులు AK-47తో ఆయనకు అంగరక్షకులుగా నియమితులయ్యారు. సెలబ్రిటీలకు, రాజకీయనేతలకు, అధికారంలో ఉన్నవారికి, పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఉండే సెక్యూరిటీ ఒక సాధారణ వ్యక్తికి ఉండటం చూసి దయాల్ దగ్గరకు వచ్చే వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. దేశవ్యాప్తంగా ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.